అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ ప్రభావం గురించి పెద్దగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతీ రోజు ఏదో ఒక మూల తుపాకి పేలుళ్ళ శభ్దాలు వినపడుతూనే ఉంటాయి, ఎంతో మంది అమాయకులు బలై పోతూనే ఉంటారు.
ఎన్ని పరిణామాలు జరిగినా ప్రభుత్వ నిర్ణయాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.తాజాగా అమెరికాలో జరిగిన మరో తుపాకి పేలుళ్ళ ఘటనతో అమెరికా వాసులు ఉలిక్కిపడ్డారు.
ఎప్పటిలానే స్వచ్చంద సంస్థలు ఈ ఘటనను ఖండించాయి.వివరాలలోకి వెళ్తే.
సరిగ్గా రెండు నెలలో క్రితం అమెరికాలోని ఓ రెస్టారెంట్ పబ్ లో జరిగిన తుపాకి కాల్పుల ఘటన ఒక్కసారిగా అందరిని ఆందోళనకు గురించేసింది.విచక్షణారహితంగా ఓ దుండగుడు జరిపిన కాల్పులలో ఎంతో మంది అమాయకులు మృతి చెందారు.
తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.కాలిఫోర్నియాలొని వాస్కో సిటీలో ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరుపుతున్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన వచ్చారు.
దుండగుడు వారిని చూడగానే దగ్గరలోని ఓ ఇంట్లోకి పారిపోయాడు.
దాంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి అతడిని లొంగిపోవాలని ఎంతగా చెప్పినా ఎదురు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా అతడిపై కాల్పులు జరిపారు.అయితే దుండగుడు ఇంట్లోని ముగ్గురు వ్యక్తులపై కాల్పులు జరుపగా వారు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ క్రమంలో దుండగుడు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పులలో ముగ్గురు పోలీసులు గాయపడగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని అధికారులు దృవీకరించారు.అయితే అసలు దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడు, ఆ ఇంట్లోని ముగ్గురు వ్యక్తులను ఎందుకు చంపాడు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.గన్ కల్చర్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వచ్చంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.