విదేశాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నా.రోజుకో మోసం వెలుగుచూస్తున్నా భారత్లో, ముఖ్యంగా తెలుగునాట ఎన్ఆర్ఐ అల్లుల్లపై వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
దీనిని క్యాష్ చేసుకుంటున్న కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు.మ్యాట్రిమోని సైట్లలో ఫేక్ ప్రోఫైల్ పెట్టడమో లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారానో వల వేస్తున్నారు.
తనను తాను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని, మాయ మాటలతో అందినకాడికి దోచుకుంటున్నారు.అంతో ఇంతో చదువుకున్న వారితో పాటు డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వంటి ప్రొఫెషనల్స్ కూడా కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.
తాజాగా ఓ కేటుగాడు తనను ఎన్ఆర్ఐ వైద్యుడిగా చెప్పుకుని.హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (34)కి రూ.50 లక్షల టోకరా వేశాడు.వివరాల్లోకి వెళితే.
నగరానికి చెందిన వితంతవైన బాధితురాలు.రెండో వివాహం కోసం ఓ మ్యాట్రిమోని సైట్లో తన ప్రోఫైల్ ఉంచింది.
ఇది చూసిన నిందితుడు తన పేరు విజయ్ అని ఇటలీలో స్థిరపడిన భారత సంతతి వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు.అంతేకాకుండా మీ వివరాలు, అభిరుచులు నచ్చాయని మిమ్మల్ని వివాహం చేసుకుంటానని బాధితురాలికి చెప్పాడు.
అతని మాటలను నమ్మిన సదరు మహిళ నాటి నుంచి నిందితుడితో మాట్లాడటం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఓ రోజున వివాహం తర్వాత తాను భారత్కు వచ్చి స్థిరపడాలని భావిస్తున్నట్లు చెప్పాడు.
దీనిలో భాగంగా ఇటలీలో ప్రాక్టీస్ను ఆపివేశానని, కొన్ని అత్యాధునిక వైద్య పరికరాలను, విలువైన వ్యక్తిగత వస్తువులను ఎయిర్ కార్గో ద్వారా ఇండియాకు పంపినట్లు చెప్పాడు.ఇది జరిగిన పది రోజుల తర్వాత బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది.
తాను ఢిల్లీకి చెందిన కస్టమ్స్ అధికారినని అవతలి వైపు వ్యక్తి ఆమెతో చెప్పాడు.విజయ్ పేరిట ఇటలీ నుంచి కార్గో వచ్చిందని ఇది ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నట్లు బాధితురాలికి వివరించాడు.
ఈ పార్శిల్ను విడుదల చేయాలంటే రూ.38 వేలు దిగుమతి సుంకం చెల్లించాలని చెప్పాడు.ఇది నిజమేనని నమ్మిన బాధితురాలు అతను చెప్పిన విధంగా రూ.38,000లను చెల్లించింది.అయితే కొద్దిరోజులకు మళ్లీ అతని నుంచి మరోసారి ఆమెకు ఫోన్ వచ్చింది.ఇటలీ నుంచి వచ్చిన పార్శిల్లో 20,000 యూరోలు దొరికాయని.విదేశీ కరెన్సీని అక్రమ రవాణా చేసినందుకు మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.భయపడిపోయిన బాధితురాలు బతిమలాడటంతో 2.5 లక్షలు జరిమానా చెల్లించమని చెప్పాడు.ఇక నాటి నుంచి కార్గోలో వున్న పరికరాలు, వస్తువులకు డ్యూటీ చెల్లించాలంటూ విడతలవారీగా ఆమె వద్ద నుంచి మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశాడు.అయితే ఈసారి తనకు ఒకేసారి రూ.30 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.