ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళుతున్నారు.గతేడాది నుంచి ఇప్పటివరకు సెలబ్రిటీలు ఎక్కువగా ఇతర ప్రదేశాలకు వెళ్లకుండా మాల్దీవులకే ఎందుకు వెళుతున్నారని చాలామంది ప్రేక్షకులకు అనుమానం కలుగుతోంది.
కాజల్ గౌతమ్ కిచ్లు మాల్దీవులకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ ఉండటంతో సెలబ్రిటీలు మాల్దీవులకు వెళుతున్నట్టు ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఒక బాలీవుడ్ యాక్టర్ సెలబ్రిటీలు మాల్దీవుల బాట పట్టడానికి అసలు కారణాలను చెప్పేశారు.
మాల్దీవులలో ఉన్న పలు రిసార్టులు మన దేశంలోని సెలబ్రిటీలకు మాల్దీవులకు రావాలని ఆఫర్ ఇస్తున్నాయని.విమాన ప్రయాణ ఖర్చులతో పాటు అవసరమైన వసతులను తామే భరిస్తామని చెబుతూ రిసార్టులు ఆఫర్ ఇస్తున్నాయని తనకు కూడా ఇలాంటి ఆఫర్ వచ్చిందని బాలీవుడ్ యాక్టర్ చెప్పారు.
అయితే సెలబ్రిటీలు వెళ్లిన రిసార్ట్ కు సంబంధించి సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరి కొన్ని రిసార్టులు మాత్రం సెలబ్రిటీలకు ఫ్రీ ప్యాకేజ్ ఆఫర్లు ఇస్తున్నాయని తెలుస్తోంది.చిన్న దేశమైన మాల్దీవులకు ప్రధానంగా టూరిజం వల్లే ఆదాయం వస్తున్న నేపథ్యంలో కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల ఇక్కడి రిసార్టులకు భారీగా ఆదాయం తగ్గింది.స్టార్ సెలబ్రిటీలు మాల్దీవులకు రావడం వల్ల సాధారణ జనాలు కూడా మాల్దీవులపై ఆసక్తి చూపే అవకాశాలు ఉండటం గమనార్హం.
సినీ, టీవీ సెలబ్రిటీల ప్రచారంతో మాల్దీవులకు వెళ్లే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగిందని సమాచారం.సెలబ్రిటీల ప్రచారం ద్వారా భారీగా లాభాలను రాబట్టుకోవచ్చని రిసార్టుల యజమానులు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ సమ్మర్ లో మరి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మాల్దీవులకు వెళ్లనున్నారని తెలుస్తోంది.వ్యక్తిగతంగా మాల్దీవులకు వెళ్లాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉండటంతో సెలబ్రిటీలు ఫ్రీ ప్యాకేజీలు, రిసార్టుల ఆఫర్లకు అంగీకరించి మాల్దీవులకు వెళుతున్నట్టు తెలుస్తోంది.