ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్.షర్మిల తెలుగు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు.
తెలంగాణలో షర్మిల జోరు పెంచుతున్నారు.కొత్త రాజకీయ పార్టీని పెట్టే విషయంలో దాదాపు నిర్ణయం తీసుకున్న షర్మిల అక్కడ జిల్లాల వారీ నేతలతో వరుసగా సమావేశాలు పెడుతున్నారు.
పైగా ఆమె ఆంధ్రా మనిషి అని చాలా మంది విమర్శలు చేస్తుంటే… తాను మాత్రం తెలంగాణ కోడలిని అని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.పైగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెపుతున్నారు.
ఇక ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.ఆమెకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
తాజాగా షర్మిలను రెడ్డి సంఘాల నేతలు కలిశారు.షర్మిల పెట్టబోతున్న పార్టీకి తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు.షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ రెడ్లను వాడుకుని మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో రెడ్లకు రాజకీయగా ఏ దిక్కూ లేకుండా పోయిందన్నారు.కేసీఆర్ రెడ్డి కార్పొరేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని కూడా సత్యనారాయణ రెడ్డి విమర్శించారు.
ఇక షర్మిల పెట్టే పార్టీతో అయినా తెలంగాణలో రెడ్లకు రాజకీయంగా పాత వైభవం వస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.ఏదేమైనా ఒక్కటి మాత్రం అర్థమవుతోంది.షర్మిల తెలంగాణ రెడ్లలో చీలిక తెచ్చే విషయంలో సక్సెస్ అవుతోన్న పరిస్థితి ఉంది.అదే జరిగితే రెడ్డి ఓటు బ్యాంకును చాలా వరకు తమ వైపునకు తిప్పుకున్న కేసీఆర్కు పెద్ద షాక్ తప్పదు.
అలాగే రెడ్లలో సాంప్రదాయంగా కొంత ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్కు దెబ్బపడి ఆ పార్టీ మరింత ఇరకాటంలో పడడం ఖాయం.