ఏపీ సీఎం జగన్ కు వరుసగా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.ఎప్పుడూ పై చేయి తనదే ఉండాలి అనుకోవడం తప్ప ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాజకీయం చేయడంలో జగన్ ముందు ఉంటారు.
ఏ విషయంలోనూ రాజీ పడే తత్వం జగన్ ది కాదు.ఇదే విధమైన వైఖరితోనే జగన్ మొదటి నుంచి ఉంటూ వస్తున్నారు.
ఆ తత్వమే 151 సీట్ల తో జగన్ ను అధికారంలోకి తీసుకు వచ్చింది.అదే వైఖరి దేశవ్యాప్తంగా జగన్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
కానీ అదే వైఖరి ఇప్పుడు జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టడమే కాకుండా, ఇప్పటి వరకు వివిధ రూపాల్లో వచ్చిన క్రెడిట్ మొత్తాన్ని దెబ్బతీసే విధంగా తయారయింది.చాలా కాలంగా జగన్ వైఖరి వివాదాస్పదంగా ఉంటూనే వస్తోంది.
ఎక్కడా రాజీ పడే తత్వం జగన్ ది కాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలతోనూ జగన్ వ్యవహరిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవడంతో పాటు, రాజకీయంగాను.
ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగా మొదటి నుంచి కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.
ఈ విషయంలో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీలు పై చేయి సాధిస్తూ వస్తున్నాయి.దాదాపుగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 70 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువడ్డాయి.
అయితే ఈ అన్ని వ్యవహారాలలో జగన్ దూకుడు ఎలా ఉన్నా, ఆయన చుట్టూ ఉండే కీలక నాయకులు, న్యాయసలహాదారులు, లక్షలు జీతాలు పొందుతున్న ప్రభుత్వ సలహాదారులు చాలామంది ఉన్నారు.కానీ ఎవరి వల్ల జగన్ కు కానీ, ఆయన ప్రభుత్వానికి కానీ పెద్దగా కలిసి వచ్చింది ఏమి లేదు అన్నట్లు గానే కోర్టు తీర్పులు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.అయితే న్యాయస్థానాల్లో ఈ విధమైన తీర్పులు రావడం మొదటి నుంచి జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.
ఏదో రకంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించేందుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది.హైకోర్టు ఆ తరువాత సుప్రీం కోర్టుకు వెళ్లినా, నిమ్మగడ్డ కు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి.
అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి గవర్నర్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తో తప్పించి కనగరాజ్ అనే వ్యక్తిని ఏపీ ఎన్నికల అధికారి గా నియమించారు.
నిమ్మగడ్డ కోర్టు ద్వారా మళ్లీ తన పదవిని సంపాదించి రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు మళ్లీ స్వీకరించారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని ఆయన ప్రకటించిన తరువాత ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం, అక్కడ కూడా అనుకూలంగా తీర్పులు రావడం ఇప్పుడు ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువచ్చాయి.ఇలా ఒకటి కాదు, రెండు కాదు ప్రతి విషయంలోనూ జగన్ దూకుడుగా ముందుకు వెళుతూ చివరకు అభాసుపాలు అవుతున్న తీరు వైసీపీ శ్రేణులకు సైతం ఇబ్బందికరంగా మారింది.
కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన ప్రతిసారి ప్రతిపక్షాలు తాము విజయం సాధించాము అన్నట్టుగా వ్యవహరిస్తుండడం వంటివి వైసీపీ శ్రేణులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు జోలికి వెళ్లే ముందు సరైన ప్రణాళిక లేకుండా, ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం , ప్రతి నిర్ణయంలోనూ తమదే పైచేయిగా ఉండాలి అనుకోవడం తప్ప దాని వల్ల వచ్చే ఇబ్బందులు, కోర్టులో ఇబ్బందులు ఇలా వేటిని జగన్ పట్టించుకోకపోవడం, అలాగే జగన్ కు సలహాలు ఇచ్చే వారు, కోర్టు పిటిషన్ లు వేసే ముందు న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవడం ఇలా ఎన్నో కారణాలతో వైసిపి ప్రభుత్వం చిక్కుల్లో పడుతూ వస్తోంది.
జగన్ రాజ్యాంగ వ్యవస్థలతో తలపడుతూ, పదే పదే వివాదాస్పదం అవుతుండడమే కాకుండా ప్రజల్లో తన పరపతి ని తగ్గించుకుంటూ వస్తునట్లుగా కనిపిస్తున్నారు.ప్రజా సంక్షేమ పథకాల ద్వారా వచ్చిన పేరు ప్రఖ్యాతులను ఈ విధమైన మొండి వైఖరి తో తగ్గించుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
ఇకనైనా రాజ్యాంగ వ్యవస్థల విషయంలో కానీ, ఏదైనా వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ జగన్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మొదటికే మోసం వచ్చేలా పరిస్థితి ఉంది.