ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సంపన్నమైన అమెరికా కంటికి కనిపించని సూక్ష్మజీవితో యుద్ధం చేస్తోంది.కరోనా కారణంగా ఈ భూమ్మీద బాగా ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే.కోవిడ్ 19 కారణంగా 8,19,175 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.45,343 ప్రాణాలు కోల్పోయారు.కోవిడ్ 19 బారినపడ్డ వారి జీవితాలను నిలబెట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.అయినప్పటికీ వారు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.అయితే వారిని రక్షణ పరికరాల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
ఇది ఒక్క వైద్య రంగానికే పరిమితం కాలేదు… అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు.దేశంలో కోవిడ్ 19 మహమ్మారి ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు అమెజాన్ తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ వందల మంది అమెజాన్ గోడౌన్ ఉద్యోగులు సమ్మెకు దిగడం దేశంలో చర్చనీయాంశమైంది.
కరోనా పాజిటివ్ కేసులున్న గిడ్డంగుల వద్ద పని చేసేవారికి రక్షణ పరికరాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గోడౌన్లను శుభ్రపరచడం, భద్రతా సామాగ్రి, జీతంతో కూడిన అనారోగ్య సెలవు, ప్రమాద వేతనం కూడా అందించాలని అమెజాన్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.అదే సమయంలో వ్యతిరేకంగా మాట్లాడిన తమ సహచరులపై ప్రతీకార చర్యలకు దిగొద్దని వారు కోరారు.అమెజాన్కు ఆదాయం మీద ధ్యాసే తప్ప తమ భద్రతపై శ్రద్ధ లేదని మిచిగాన్లోని అమెజాన్ కార్మికుడు జేలెన్ క్యాంప్ ఆరోపించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గోడౌన్లను మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమాలను పూర్తిగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా 130కి ఉన్న అమెజాన్ గోడౌన్లలో 30 మంది కార్మికులకు పాజిటివ్గా తేలినట్లు వర్కర్స్ రైట్స్ గ్రూప్, యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్ తెలిపింది.అయితే తాజా తాజా పరిణామాలపై ఇంకా స్పందించని యాజమాన్యం టెంపరేచర్ చెకింగ్, మాస్క్లు, శానిటైజేషన్ వంటి ప్రక్రియలను చేపడుతున్నామని కంపెనీ ప్రకటించింది.