ఒలింపిక్స్ లో పాల్గొనడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు.అందులో కొందరు విజయం సాధిస్తే మరికొందరికి నారాశ ఎదురవుతుంది.
అటువంటి ఒలింపిక్స్ గేమ్స్ లో ముఖ్య ఘట్టమైన ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది.ఆ జ్యోతిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు.
కానీ కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది.మరి అలాంటి ఒలింపిక్స్ గేమ్ లో జ్యోతిని పట్టుకుని తిరిగిన ఓ మహిళ నేడు దీనావస్థలో ఉంది.
ఆ క్రీడాకారిణి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.టోక్యో ఒలింపిక్స్ లో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది.
వందేళ్ల కల సాకారమైంది.ఇదే దేశంలో అలనాటి క్రీడాకారిణి ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించింది.
పింకీ కర్మాకర్ అనే క్రీడాకారిణి అస్సాంలోని దిబ్రుగర్ జిల్లాలో జీవనం సాగిస్తోంది.ఆమె లండన్ ఒలింపిక్స్ లో పాల్గొంది.2012వ సంవత్సరంలో జరిగిన ఈ గేమ్స్ లో పింకీ కర్మాకర్ ఒలింపిక్ టార్చ్ బేరర్ గా ఇండియా తరపున పాల్గొంది.ఆ క్రీడాకారిని నేడు అంటే సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత ఓ కూలిగా పనిచేసుకుంటూ పొట్టను నింపుకుంటోంది.కుటుంబ పోషణ భారమవ్వడంతో వారికి అండగా నిలిచేందుకు ఈమె టీ తోటలో కూలిగా పని చేస్తోంది.17ఏళ్ళ వయసులోనే పింకీ కర్మాకర్ ఇండియా తరపున పాల్గొని టార్చ్ బేరర్ గా బాధ్యత వహించడం గొప్ప విషయం.ఆమెకు అప్పటి కేంద్ర మంత్రి అయిన అస్సాం మాజీ ముఖ్యమంత్రి నంద సోనోవాల్, అప్పటి దిబ్రూగర్ ఎంపీ ఇద్దరూ పింకీకి విమానాశ్రయంలో స్వాగతం పలికి సత్కరించారు.నేడు ఆమె కేవలం రోజుకి 167 రూపాయల కూలీకి రోజూ టీ తోటలో పనులు చేసుకుంటోంది.
పింకీ కర్మాకర్ కు ఓ తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.తల్లి కన్నుమూసింది.దీంతో ఆమె ఇంటికి అండగా నిలిచింది.తనకు ప్రభుత్వం సాయం చేస్తే తన కుటుంబం కూడా బాగుపడుతుందని ఆమె సర్కార్ ను వేడుకుంటోంది.
ఇకనైనా ప్రభుత్వాలు ఆమెను గుర్తిస్తాయో లేదో వేచి చూడాాల్సిందే.