వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఘన విజయాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.ఓటమిని హుందాగా అంగీకరించాలి.
అంతేకానీ లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతాయి.గులాబీ పార్టీ గెలుపుకు కారణాలు ఏమిటి? తమ ఓటమికి కారణాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలి.అంతే తప్ప ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే జనం మద్దతు ఇవ్వరు.ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.చాలా హోరాహోరీగా ప్రచారం చేశాయి.కారు పార్టీ ఓడిపోవడం ఖాయమని చెప్పాయి.
అతి తక్కువ మెజారిటీ వస్తుందని అనుకున్నాయి.కనీ ఊహించనంత మెజారిటీ రావడంతో దిక్కు తోచకుండా ఉన్నాయి.
దీంతో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయి.గులాబీ పార్టీ విజయానికి కారణం అధికారాన్ని, పోలీసులను, అధికారులను ఉపయోగించడమేనని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
దీనికి ఆధారం ఏమిటి? ఇలాంటి ఆరోపణలు జనం నమ్ముతారా? ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ సాధించిన విజయాన్ని లెక్కలోకి తీసుకోనక్కరలేదని మరో టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే నిజమైన విజయమని అన్నారు.2019 ఎన్నికల్లో తీడీపీయే విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు.ఈ ఉప ఎన్నికలో ఓడిపోయినా గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని గులాబీ పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.ఇలా ఎవరికీ తోచిన ప్రకటనలు వారు చేస్తున్నారు తప్ప ఆత్మ విమర్శ చేసుకునే ప్రయత్నాలు చేసుకోవడం లేదు.
ఓటమిని హుందాగా ఒప్పుకుంటే నష్టం ఏముంది?