వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారత సంతతి ప్రజలు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజ సంస్థలకు పలువురు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.
సత్యనాదెళ్ల, సుందర్ పిచాయి, అరవింద్ కృష్ణ, ఇంద్రా నూయి వంటివారు విజయవంతంగా కంపెనీలను నడిపిస్తున్నారు.ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన నేహా పరిఖ్ గూగుల్ అనుబంధ నావిగేషన్ యాప్ ‘‘ Waze ’’కు సీఈవోగా నియమితులయ్యారు.
ఆమె గతంలో ప్రముఖ ట్రావెల్ వెబ్సైట్ హాట్వైర్కు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు.
నేహా పరిఖ్ 2000లో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్లో మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.ఇందులో ఒక ఏడాది పనిచేసిన తర్వాత బిజినెస్ అనలిస్ట్, మార్కెటింగ్ మేనేజర్, డిమాండ్- గ్రోత్ స్ట్రాటజీ కన్సల్టెంట్ వంటి ఇతర స్థానాల్లోనూ పనిచేశారు.41 ఏళ్ల నేహా ఆన్లైన్లో పాత వాహనాలను విక్రయించే రిటైల్ సంస్థ కార్వానా బోర్డులో సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.జూన్ చివరిలో ‘‘ Waze ’’కు సీఈవోగా నియమితులైన నేహా పరిఖ్.ఆన్లైన్ హాస్పిటాలిటీ బ్రాండ్ ఎక్స్పీడియాలో పనిచేశారు.అలాగే దీని అనుబంధ సంస్థలైన హోటల్స్.కామ్, హాట్వైర్కు మొదటి మహిళా ప్రెసిడెంట్గా, అతి పిన్న వయస్కురాలిగా ఘనత వహించారు.
ఇక Waze విషయానికి వస్తే.185కు పైగా దేశాల్లో 140 మిలియన్ల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి వుంది.వీరు ప్రతినెల 24 బిలియన్ మైళ్లు (40 బిలియన్ కిలోమీటర్లు) కంటే ఎక్కువ డ్రైవ్ చేస్తారు.ఈ నావిగేషన్ యాప్.56 వేరు వేరు భాషలలో అందుబాటులో వుంది.500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థలో ఎక్కువ మంది ఇజ్రాయిలీలే వున్నారు.