ఏపీ, తెలంగాణలో హాట్ టాపిక్ రాజకీయ వ్యవహారం ఏదైనా ఉందా అంటే అది షర్మిల కొత్త పార్టీ గురించిన అంశమే.తాను తెలంగాణకు సీఎం అవుతాను అంటూ షర్మిల తన మనసులో మాటను బయట పెట్టుకున్నారు.
అంతే కాదు ఇంకా పార్టీ ఏర్పాటు చేయకముందే, రాజకీయ ప్రత్యర్థులుగా టిఆర్ఎస్ , బిజెపిలను చూస్తూ రాజకీయ విమర్శలు షర్మిల చేస్తున్నారు.విద్యార్థులు నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యల పై పోరాటం మొదలు పెట్టారు.
ఇప్పటికే ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులు అందరిని కలుసుకున్నారు.సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
అంతేకాదు త్వరలోనే తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించేందుకు, మరో రెండు నెలల్లో పార్టీ పేరును ప్రకటించేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.కానీ ఇదంతా ఆమె సొంతంగా చేసుకుంటున్న వ్యవహారమే తప్ప, ఇందులో జగన్ సహకారం గాని ,వైసీపీ మద్దతు గాని లేవని , అసలు జగన్ షర్మిల మధ్య రాజకీయ విభేదాలు ఉండటంతోనే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండగా , దీనికి తగ్గట్టుగానే సాక్షి మీడియా కూడా తక్కువ కవరేజ్ ఇస్తోంది.
సోదరి షర్మిల పట్ల జగన్ సోదరభావంతో ఉంటారు తప్ప కుటుంబ పరంగా ఎటువంటి విభేదాలు లేవని, ఇటీవల వైసిపి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.అయితే వైసీపీకి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న జగన్ తల్లి వైయస్ విజయలక్ష్మి ఇప్పుడు షర్మిల నిర్వహించిన నిరుద్యోగ దీక్ష లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా అవుతోంది.
షర్మిల తల్లిగా ఆమె ఈ దీక్షలో పాల్గొన్నారు అనుకున్న, ఆమె వైసీపీకి గౌరవాధ్యక్షురాలు గా ఉండడంతో, రెండు పార్టీలకు ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉంటున్నారా ? జగన్ సహకారం షర్మిలకు ఉందా ? షర్మిల కోసమే తెలంగాణలో వైసీపీని యాక్టివ్ చేయలేదా ? షర్మిల కొత్త పార్టీ వెనుక జగన్ ఉన్నారా ? ఇలా అనేక అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.అదీ కాకుండా ఇటీవలే వైఎస్ కుటుంబంలో విభేదాలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ లేఖను విడుదల చేసిన వైఎస్ విజయలక్ష్మి, ఇప్పుడు అదే షర్మిలకు మద్దతుగా ఇంటర్వ్యూ ఇవ్వడం వంటివి రాజకీయ ఆసక్తిని కల్గిస్తున్నాయి.
ఏపీలో జగన్ సీఎం హోదాలో ఉండడంతో, షర్మిలను తెలంగాణలో సీఎం హోదాలో చూడాలనే ఆకాంక్షతోనే వైఎస్.విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు అనుకున్న, ఆమె వ్యవహారాలు వైసిపికి, జగన్ కు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించేవే.టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో జగన్ సఖ్యతగా ఉంటూ వస్తున్నారు.మొదటి నుంచి ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.అసలు షర్మిల పార్టీ ఏర్పాటు కేసీఆర్ కు అనుకూలంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చీల్చేందుకు షర్మిల పార్టీని కెసిఆర్ వెనకుండి ఎంకరేజ్ చేస్తున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే ఇప్పుడు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిల కు అండగా నిలబడడం ఆసక్తికరంగా మారింది.