కరోనా సమయంలో తల్లి మరణించడంతో అనాథగా మారిన ఒక బాలుడు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు.పట్టెడన్నం పెట్టేవారు ఎవరూ లేక ఆకలి తట్టుకోలేక అతడు చివరికి బిచ్చగాడిలా మారాడు.
అయితే నరకం లాంటి జీవితం అనుభవిస్తున్న అతడిపై దేవుడు కరుణించాడు.రాత్రికి రాత్రే కోట్ల ఆస్తి అతడికి అందించాడు.
అలా మొన్నటిదాకా దిక్కు మొక్కు లేని ఈ అబ్బాయి ఇప్పుడు కోటీశ్వరుడై రాజభోగాలు అనుభవిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, సహరాన్పూర్ జిల్లా, పండోలి విలేజీలో ఇమ్రానా తన భర్త నవేద్తో కలిసి నివసించేది.అయితే ఒక రోజు తన భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు.
అప్పటికే ఆమెకు 10 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.అయితే భర్త చనిపోయిన తర్వాత అత్తవారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాధలు భరించలేక ఆమె 2019లోనే తన కొడుకు షాజెబ్తో కలిసి కలియార్లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది.
అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే కరోనా రూపంలో ఇమ్రానా ప్రాణాలు పోయాయి.దాంతో షాజెబ్ అనాథగా మారాడు.అప్పటినుంచి అతడికి అన్నం పెట్టేవారు లేక బిచ్చగాడిగా మారాడు.
అయితే చాలా కష్టాలు పడిన తర్వాత చివరికి ఆ బాలుడికి తన తండ్రి కుటుంబం ద్వారా వారసత్వ ఆస్తి లభించింది.అదెలాగో తెలుసుకుంటే.షాజేబ్ తాత మహ్మద్ యాకూబ్ చనిపోయే ముందు ఒక వీలునామా రాశాడు.
అందులో ఐదు బిగాల భూమి, ఓ ఇల్లు అంటే తన ఆస్తిలో సగభాగాన్ని షాజేబ్ పేరు మీద రాశాడు.ఈ విషయం తెలుసుకున్న తండ్రి తరుఫు రిలెటివ్స్ షాజేబ్ కోసం వెతికి పట్టుకున్నారు.
ఆ సమయానికి అతడు కలియార్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ కనిపించాడు.ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు తిరిగి ఇంటికి తీసుకువచ్చి ఇంటిని, భూమిని తనకి అందించారు.
అలాగే అతడికి ఆహారాలతో పాటు కావాల్సిందల్లా అందిస్తున్నారు.అలా ఈ బాలుడు తన కష్టాల నుంచి బయటపడ్డాడు.