నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలు.చదువుల బడిలో పాఠాలు చెప్పేవారు లేకపోతే వాళ్ళ పరిస్తితి ఏంటి? తాగడానికి నీళ్ళు లేక, తినే తిండి సరిగా లేకపోతే వారి చదువులు ఎలా సాగుతాయి.వేలాది మంది చదివే సాంకేతిక విద్యా కాలేజీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటే బాధ్యత ఎవరిది? విద్యార్థులు సమ్మె చేస్తుంటే పాలకులకు అంత నిర్లక్ష్యం ఎందుకు?.
పురుగుల అన్నం అయినా తింటాం గాని చదువులు చెప్పే లెక్చరర్లను నియమించండని బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కోరుతున్నారు.ఏళ్ళ తరబడి తమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో మూడు రోజులుగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్ లోనే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు.8 వేల మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రభుత్వం ముందు 12 డిమాండ్లను ఉంచారు.తమ క్యాంపస్ కు పర్మినెంట్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలని, భోజనం తినడానికి వీలైనది పెట్టాలని, నీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాలని కోరుతున్నారు.విద్యార్థులు కోరేవాటిలో ఏదీ పెద్ద కోరిక కాదు.
అన్నీ న్యాయమైన కోరికలే.అయితే విద్యార్థులవి సిల్లీ డిమాండ్స్ అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్ చేశారనే వార్తలతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి లేదా కేటీఆర్ తమ దగ్గరకు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు.

విద్యార్థుల డిమాండ్స్ తెలుసుకున్న ప్రభుత్వం ఉస్మానియా ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను డైరెక్టర్ గా నియమించింది.అయితే తమకు రెగ్యులర్ వీసీని నియమించాల్సిందేనని, డైరెక్టర్ తో సమస్యలు పరిష్కారం కావని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు.బుధవారం నాడు మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేస్తూ…విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు.
అయితే మంత్రి క్యాంపస్ కు వచ్చి హామీ ఇస్తేనే విరమిస్తామని స్పష్టం చేశారు.విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు బుధవారం క్యాంపస్ కు వచ్చారు.
విషయం తెలిసిన వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారందరినీ స్టేషన్ కు తరలించారు.తమ తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.