ఏపీలో మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి.సాధారణంగా రాజకీయ పార్టీలు అన్న తర్వాత వర్గ పోరు ఉంటుంది.
కానీ అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు మిగతా పార్టీలతో పోలిస్తే ఎక్కువగా ఉందనే చెప్పాలి.ముఖ్యంగా గత ఎన్నికల్లో వైసీపీకి పరాభవం మిగిల్చిన విశాఖలో వర్గ పోరు ఆ పార్టీకి మరోసారి తీరని నష్టం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల వైసీపీ సర్కారు చేపట్టిన జిల్లాల విభజన తర్వాత విశాఖ జిల్లాలో కేవలం ఆరు అసెంబ్లీ సీట్లే ఉన్నాయి.ఈ ఆరింటిలో నాలుగు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి.
అటు వైసీపీ గెలిచిన భీమిలి, గాజువాకలలోనూ ప్రస్తుతం టీడీపీ స్ట్రాంగ్గా ఉంది.విశాఖ వెస్ట్ చూసుకుంటే వైసీపీ వర్గపోరు నానాటికీ పెరుగుతోంది.151 సీట్లలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పటివరకు అక్కడ స్ట్రాంగ్ కాలేకపోయిందంటే దానికి కారణం వర్గపోరు మాత్రమే.
2014లో విశాఖ వెస్ట్ నుంచి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్కు వైసీపీ టిక్కెట్ ఇవ్వగా నాన్ లోకల్ కార్డుతో ఆయన ఓడిపోయారు.2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్కు టిక్కెట్ ఇవ్వగా ఆయన కూడా పరాజయం పాలయ్యారు.2024 ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఎవరికి కేటాయిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు.అయితే వైసీపీకి విరుద్ధంగా టీడీపీ పరిస్థితి ఉంది.వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు మరోసారి విజయం సాధిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే విశాఖ వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం, వచ్చే ఎన్నికలలో టిక్కెట్ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి.పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మళ్ళ విజయప్రసాద్ వ్యక్తిగత ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
దీంతో ఆయనకు బదులుగా తమను నియమించమంటూ పలువురు వైసీపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు.
![Telugu Andhra Pradesh, Vishaka, Vishakapatnam, Ysrcp-Telugu Political News Telugu Andhra Pradesh, Vishaka, Vishakapatnam, Ysrcp-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2022/06/andhra-pradesh-ysrcp-tdp.jpg)
కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు, మళ్ళ విజయప్రసాద్ అనుచరుడు దొడ్డి కిరణ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారుట.డిప్యూటి మేయర్ జియాన్ శ్రీధర్ కూడా నియోజకవర్గ ఇన్చార్జ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీధరే ముందుండి నడిపిస్తున్నారు.
అయితే శ్రీధర్కు సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నేత గణబాబుని ధీటుగా ఎదుర్కొనే సీన్ లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.