1983.ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని రోజు.
కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు మర్చిపోలేని విజయాన్ని అందుకున్న రోజు.ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన రోజు.
తొలిసారి వరల్డ్ కప్ అందుకున్న రోజు.భారతీయ క్రికెట్ అభిమానులు గర్వంతో తల ఎత్తుకున్న రోజు.
మొత్తంగా భారతీయులందరికీ మర్చిపోలేని రోజు.చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత జట్టులోని సభ్యులు అప్పట్లో అందుకున్న జీతం ఎంత? ప్రస్తుతం ఈ అంశంపై ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది.
1983లో వన్డే మ్యాచ్ల కోసం టీమిండియా ఆటగాళ్లు తీసుకున్న ఫీజు ఇంత అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.అప్పటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతానికి సంబంధించిన ఒప్పంద కాగితం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ లిస్టులో కెప్టెన్ కపిల్ దేవ్, మొహిందర్ అమర్ నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, మేనేజర్ బిషన్ సింగ్ బేడీ సహా 14 మంది ఆటగాళ్ల జీతం వివరాలు పొందుపర్చి ఉన్నాయి.ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుతో పాటు రోజు వారీ ఖర్చుల నిమిత్తం ఇచ్చే డబ్బుల వివరాలు కూడా ఉన్నాయి.
21 సెప్టెంబర్ 1983 నాటికి సంబంధించిన పే స్లిప్లో ఆటగాళ్లందరి జీతం గురించి వివరాలు ఉన్నాయి.
వారి జీతాల పక్కన ఆటగాళ్ల సంతకాలు కూడా ఉన్నాయి.కపిల్ దేవ్కు మొత్తం మూడు రోజులకు రోజువారీ భత్యం రూ.600 ఇచ్చారు.అంటే, రోజుకు రూ.200.మ్యాచ్ ఫీజు రూ.1500 ఇచ్చారు.మొత్తం రూ.2100 ఇచ్చారు.అదే జీతం వైస్ కెప్టెన్ మొహిందర్ అమర్ నాథ్కు కూడా అందించారు.వీరితో పాటు సునీల్ గవాస్కర్, కె.శ్రీకాంత్, యశ్ పాల్ శర్మ, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్వీందర్ సంధు, దిలీప్ వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సునీల్ వాల్సన్కు కూడా రూ.2100 అందజేశారు.