ఏపీ లో టికెట్ రేట్ విషయంలో ఎంత వివాదం చెలరేగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ సినీ పెద్దలు ఎన్ని విన్నపాలు చేసిన ఏపీ ప్రభుత్వం ఎక్కడ తగ్గలేదు.
దీంతో చాలా మంది డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్ రేట్ పెంచాలని కోర్టుకు వెళ్లగా కోర్టు వారికీ సానుకూలంగా తీర్పు చెప్పింది.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం టికెట్ రేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ లో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది.కొత్త జీవో జారీ చేసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.
సినీ ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగాస్టార్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.”తెలుగు సినీ పరిశ్రమ కోరిక ని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జీవో లు జారీ చేస్తూ సినిమా థియేటర్లు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తుంది.టికెట్ ధరలను పెంచాలన్న అభ్యర్ధనను ఆమోదించాలిసిందిగా హోంశాఖ అధికారులను ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.అందుకు అనుగుణంగా జీవో జారీ అయ్యింది.