తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.అందరూ ఆ ఆశ్చర్యం లో ఉండగానే తాను అనుకున్న పన అనుకున్నట్టుగా సక్సెస్ చేసుకుంటూ ఉంటారు.
కెసిఆర్ తెలంగాణ లో అమలు చేస్తానని ప్రకటించిన దళిత బందు పథకం ప్రకటన రాజకీయ వర్గాలతో పాటు , అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.ఎందుకంటే తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తాను అంటూ కేసీఆర్ ప్రకటించారు.
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గం ని ఎంపిక చేసుకున్నారు.ముందుగా ఇక్కడ అమలు చేసి ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు .ఈ మేరకు ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్ పథకాన్ని ప్రారంభించేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.
ఈ పథకం ద్వారా తాము హుజురాబాద్ లో సునాయాసంగా గెలవగలం అనేదే ధీమా ను కెసిఆర్ వ్యక్తం చేశారు.
అయితే ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న పథకం అని , దీనిని అమలు చేయాలంటే లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రతిపక్షాలు సుతిమెత్తగా విమర్శలు చేసినా, కేసీఆర్ మాత్రం దీనిని అమలు చేస్తానని, ఇందులో వెనక్కి తగ్గేది లేదు అంటూ ప్రకటించారు.అయితే అనుకున్న దానికంటే ముందుగా కేసీఆర్ తన దత్తత గ్రామం అయిన వాసాలమర్రి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో 16న తేదీని ప్రకటించి, ముందుగానే కేసీఆర్ ఎందుకు ప్రకటించారనే చర్చ మొదలైంది.హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని కెసిఆర్ కు ముందుగానే సమాచారం ఉండటంతోనే, ఈ పథకాన్ని ప్రారంభించిన అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ పథకాన్ని కేవలం వాసాలమర్రి వరకే పరిమితం చేస్తే ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, హుజురాబాద్ లో ఈ పథకాన్ని అమలు చేయకుండా కేసీఆర్ నియోజకవర్గంలో పార్టీకి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.వాసాలమర్రి వరకు ఈ పథకాన్ని అమలు చేస్తే దాదాపు 7,8 కోట్ల వరకు సొమ్ములు వెచ్చిస్తే సరిపోతుంది .అదే హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలంటే దాదాపు 2 వేల కోట్ల రూపాయలు అవసరం.ప్రస్తుతం తెలంగాణ ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అంత సొమ్ము వెచ్చించే పరిస్థితి లేదు.
ఈ విషయంలో వెనక్కి తగ్గి నిందలు వేయించుకునే కంటే, వాసాలమర్రి లో ఈ పథకాన్ని ప్రారంభించి హుజురాబాద్ లో మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ ను సాకుగా చూపించాలని ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇప్పటికే వాసాలమర్రి లో ప్రారంభించాము కనుక హుజురాబాద్ లోనూ అమలు చేస్తామని , ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తులు చేయాలని, అయినా వారు అనుమతించే అవకాశం ఉండదు కాబట్టి , ఈ పథకం అమలు కాకుండానే తన వ్యూహం నెరవేరుతుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్లుగా టీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్ధులు అనుమానిస్తున్నాయి.