ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది.నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో అంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్కు చెందిన విలియం షేక్స్పియర్ (81) మంగళవారం కన్నుమూశారు.
వ్యాక్సిన్తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్ 8న ఆయన ఫైజర్ టీకా తీసుకున్నారు.
ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్ కీనన్ కరోనా టీకా తీసుకుని రికార్డు సృష్టించారు.ఇదిలా ఉండగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఒకానొక సమయంలో ఒకే రోజు దాదాపు 4.5 లక్షల పాజిటివ్ కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ విధించడమో, లేక కఠినమైన కర్ఫ్యూని అమలు చేయడమో చేస్తున్నాయి.దీంతో, కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చింది.తాజాగా కొత్త కరోనా కేసులు 2 లక్షల దిగువకు వచ్చాయి.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో మహమ్మారి నుంచి కోలుకుని 3,26,850 మంది డిశ్చార్జ్ అయ్యారు.దేశ వ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మరోవైపు ఇప్పటి వరకు దేశంలో 2,69,48,874 మంది కరోనా బారిన పడ్డారు.వీరిలో 2,40,54,861 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 3,07,231కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మరోవైపు ఇప్పటి వరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది.
లాక్ డౌన్లు మరికొంత కాలంపాటు కొనసాగితే కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.