ఒకపక్క అధికార పార్టీ వైసిపి దూకుడు చర్యలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిరాశ నిస్పృహల్లో ఉండడమే కాకుండా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో చాలా మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు సైతం ముందుకు రాని పరిస్థితులు నెలకొనడంతో, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనసేన పార్టీ క్రమంగా తమ బలం పెంచుకుంటూ ఈ ఎన్నికలలో పై చేయి సాధిస్తూ వస్తోంది.
కానీ తెలుగు తమ్ముళ్లలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదు.అధినేత చంద్రబాబు పదేపదే పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగించే విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ, నిత్యం ప్రజల్లోనూ, పార్టీ నాయకుల్లోనూ ఉత్సాహం పెరిగే విధంగా వ్యవహరిస్తున్నా, అధినాయకుడు తాపత్రయాన్ని పార్టీ నాయకులు పట్టించుకోనట్టు వ్యవహరిస్తూనే ఉన్నారు.
ఆధిపత్య పోరుతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీని మరింత కష్టాలపాలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.తాజాగా విజయవాడలో ఎంపీ కేశినేని నాని, బుద్ధ వెంకన్న మధ్య చోటు చేసుకున్న వివాదం తెలుగుదేశం పార్టీ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
ఎక్కడికక్కడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.ఇప్పుడు విజయవాడ లో బయట పడిన సంఘటన మాత్రం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరును తెర మీదకు తెస్తోంది.
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విజయవాడలో తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాటలు మొదలయ్యాయి.ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాలు విడివిడిగా ఆధిపత్యం కోసం పోటీ పడటం వంటి వ్యవహారాలు రోడ్డుకెక్కి రచ్చ రచ్చగా మారాయి.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని 39 వ డివిజన్ అభ్యర్థిని ఎంపీ కేశినేని మార్చడం వివాదానికి కారణమైంది.39 డివిజన్ అభ్యర్థిగా పూజిత కు బీఫామ్ ఇచ్చి, ఇప్పుడు ఆమెను తప్పించడం సరైంది కాదంటూ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గం కేశినేని నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన నిలదీయడం వివాదానికి కారణమైంది.పూజితను కాదు అని శివ అనే అభ్యర్థిని ప్రకటించి, ప్రచారం చేయడంతో పూజిత తో పాటు బుద్ధ వెంకన్న వర్గం ఆందోళనకు దిగింది.ఇప్పటికీ కేసినేని నాని, బుద్ధ వెంకన్న కు మధ్య చాలా కాలం నుంచి వివాదం నడుస్తూనే ఉంది.
గతంలో సోషల్ మీడియా వేదికగా ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే.అధినేత చంద్రబాబు ఆ వ్యవహారం లో జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది.మళ్లీ ఇప్పుడు వివాదం రాజు కోవడం, ఎక్కడికక్కడ ఇదే రకమైన పరిస్థితి నెలకొనడంతో, తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే విధమైన ఆధిపత్యపోరు పార్టీ నాయకుల మధ్య నడుస్తుండడంతో, ఇప్పటికే సవాలక్ష కష్టాలతో సతమతం అవుతున్న తెలుగుదేశం పార్టీకి మరిన్ని కొత్త కష్టాలు వచ్చినట్లుగా పరిస్థితి మారింది.
ఇప్పటికే అధికార పార్టీ వైసీపీలో ఈ తరహా పరిణామాలు చోటు చేసుకోవడంతో వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని పైచేయి సాధించాలని చూస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు కు ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్య ఈ రకమైన వివాదాలు చోటు చేసుకోవడం మరింత ఇబ్బందికరంగా మారింది.అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీ కి నాయకుల మధ్య ఏర్పడిన గ్రూప్ పాలిటిక్స్ మరింత చేటు తీసుకొస్తున్నాయి.