తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.మందుల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారనే కేసులో ఇప్పటికే దేవికారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఆమె భర్త గురుమూర్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడిని ఏసీపీ కోర్టులో హాజరు పరిచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
దేవికా రాణి, గురుమూర్తికి హైదరాబాద్, కడప, తిరుపతిలో ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.వంద కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు.ఈ నెల 3వ తేదీన దేవికారాణికి బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.దేవికారాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు.

అధికారుల సోదాల్లో లభించిన 18 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ విలువ రూ.15 కోట్లు కాగా, ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ 10 రెట్లు ఎక్కువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.దేవికారాణి భర్త గురుమూర్తి ఆమె భార్య తరపున లంచాలు వసూలు చేసి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసేవాడని విచారణలో తెలుసుకున్నారు.