ఉత్కంఠకు తెరపడింది.లాంఛనాలు పూర్తయ్యాయి, తాలిబన్ల లక్ష్యం నెరవేరింది.
ఉగ్రవాదంపై పోరులో భాగంగా సుదీర్ఘకాలం ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేసిన అమెరికా సేనలు హైడ్రామా మధ్య ఆ దేశాన్ని వీడాయి.సోమవారం అర్థరాత్రి కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా సాయుధ బలగాలతో నిండిన చిట్టచివరి విమానం గాల్లోకి లేచింది.
దీంతో రెండు దశాబ్ధాల యుద్ధానికి అమెరికా ముగింపు పలికినట్లయ్యింది.మేజర్ జనరల్ క్రిస్ డోనోహువే.
ఆఫ్ఘన్ను వీడిన చిట్టచివరి సైనికుడిగా చరిత్రలో నిలిచిపోయారు.ఇందుకు సంబంధించిన ఫోటోను అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది.
అయితే సైన్యం తరలింపు పూర్తయ్యినప్పటికీ.ఆఫ్ఘన్ను వీడాలనుకునే ఆ దేశ పౌరులు, అమెరికా ప్రజలను తరలిస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఇదే సమయంలో ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరణపై తొలి నుంచి విమర్శలు చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తాజా పరిణామంపై విరుచుకుపడ్డారు.ఆఫ్ఘన్ నుంచి బలగాల ఉపసంహరణ తీరు చాలా అసమర్థంగా జరిగిందని ట్రంప్ ఆరోపించారు.ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ జో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఆఫ్గన్లో ఉన్న అన్ని అమెరికా సైనిక పరికరాలను తక్షణమే తిరిగివ్వాలని డిమాండ్ చేయాల్సిందిగా బైడెన్కు ట్రంప్ సూచించారు.యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన 85 బిలియన్ డాలర్లలో ప్రతి పైసా తిరిగి తెచ్చుకోవాలని.
ఆ పరికరాలను తిరిగివ్వకపోతే మళ్లీ అక్కడకు సైన్యాన్ని పంపి వాటిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బాంబులేసి వాటిని నాశనం చేయాలని ట్రంప్ కోరారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ముందుగానే ఆఫ్ఘన్లో వదిలివేసిన విమానాలు, ఇతర సాయుధ వాహనాలను అమెరికా సైన్యం ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.వీటిలో 73 విమానాలు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థ వున్నట్లు తెలిపారు.ఆ విమానాలు ఇక ఎగరలేవని, సాయుధ వాహనాలు, రక్షణ వ్యవస్థను మళ్లీ ఎవరూ వినియోగించలేరని సెంట్రల్ కమాండ్ తెలిపింది.

కాగా, తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకోవడం.ఆఫ్ఘన్లు దేశాన్ని విడిచి వెళ్లేందుకు పోటెత్తడంతో దాదాపు 6వేల మంది అమెరికా బలగాలు కాబుల్ ఎయిర్పోర్టులో మెహరించారు.విమానాశ్రయాన్ని వీరు తమ కంట్రోల్లోకి తీసుకోవడంతోనే పౌరుల తరలింపు ప్రక్రియ సజావుగా సాగింది.
అయితే ఎయిర్పోర్ట్ గేటు వద్ద ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో చివరి రోజుల్లో విషాదాన్ని నింపింది.