తెలంగాణ ఏర్పాటుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా నిలిచిన సీఎం కేసిఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును ప్రకటించి దేశ ప్రజల తలరాతను మార్చే గొప్పనిర్ణయం తీసుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.ఎందరో మహామహుల్ని ఎదిరించి, ఎన్నో త్యాగాలకు ఎదురొడ్డి నిలిచి ఎన్నో ఎండ్ల కలను సాకారం చేసిన నాయకుడిగా నిలిచిన కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో సంచనలం నమోదు చేయనున్నారని స్పష్టం చేశారు.
జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్ దేశ్ కీ నేతాగా అవతరించడంతో తమ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పలు రాష్ట్రాల ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారని మంత్రి అన్నారు.
కాళేశ్వరం వంటి ఎత్తిపోతలు తమ రాష్ట్రంలో కూడా సాక్షాత్కరిస్తుందని రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తమను కూడా వరిస్తాయని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పారు.
జాతీయ స్థాయిలో కేసిఆర్ కింగ్ అవ్వడం ఖాయం అని ఆయనతోనే దేశం పురోగమనదిశలో సాగుతుందన్నారు.దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు ప్రబలుతున్నాయని ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే పాలకులను సాగనంపే శక్తి కేసీఆర్కే ఉన్నదని మంత్రి తెలిపారు.
దేశాన్ని మలుపుతిప్పే శక్తి కేసీఆర్కే ఉన్నదని విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ద్వారానే భారత్ ప్రపంచ దేశాల ముందు తన సత్తాను నిరూపించుకోగలదని మంత్రి అజయ్ తేల్చిచెప్పారు.