రాజన్న సిరిసిల్ల జిల్లా : మీ సేవ అర్జీలు గడువులోగా పరిష్కరించాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.ధరణి, మీ సేవ, పెండింగ్ కోర్టు కేసులు, ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి జిల్లాలోని తహసీల్దార్లతో శుక్రవారం సమీక్షించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు.ధరణిలో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి తమ పరిధిలోని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
తహసీల్దార్ల పరిధిలో లేని వాటిని ఆర్డీఓలు, కలెక్టర్ కు ఫార్వర్డ్ చేయాలని సూచించారు.
ఆర్డీఓలు, తహసీల్దార్లు తమ పరిధిలోని కోర్టు కేసులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆయా మండలాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు పరిశీలించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు.లారీల కొరత, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని వివరించారు.వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.