ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి బాంబుల దాడితో దద్దరిల్లింది.ఆఫ్గనిస్తాన్ లో నిత్యం బాంబు దాడి లాగే అక్కడ ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.
ఎదో ఒక చోట బాంబు దాడులు చోటుచేసుకుంటూ దాదాపు నిత్యం అక్కడ పలు ప్రాంతాలు రక్తమోడుతూ ఉంటాయి.ఇప్పుడు తాజాగా కాబూల్ నగరం బాంబు దాడులతో దద్దరిల్లింది.
అమెరికా ఎంబసీకి దగ్గర్లో కారు బాంబుతో ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు.ఆ తర్వాత రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు ప్రారంభించారు.
ఈ ఘటనలో 34 మంది మృతి చెందగా, 65 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.అయితే రక్షణ మంత్రిత్వ శాఖ భవన సముదాయాలకు దగ్గరలోనే ఈ బాంబులు అమర్చడం గమనార్హం.
ఈ క్రమంలో అక్కడి అధికారులు వెంటనే అప్రమత్తమై అక్కడ భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు.అదే విధంగా ఉగ్రవాదుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆఫ్ఘానిస్తాన్ లో పోలీసులు,రద్దీ గా ప్రజలు తిరిగే ప్రాంతాలే లక్ష్యంగా పలు సార్లు ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడుతూ ఉంటారు.అయితే ఈ సారి ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారు అన్న దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ఎవరూ ప్రకటించలేదు.ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.