తాజాగా కేబిఆర్ పార్క్లో నటి చౌరాసియా పై దాడి జరిగిన విషయం మన అందరికి తెలిసిందే.రాత్రి 9:00 గంటల ప్రాంతంలో జాగింగ్ కి వెళ్లిన షాలూ చౌరాసియాపై కొందరు దుండగులు అటాక్ చేయడంతో పాటు, డబ్బులు, విలువైన వస్తువులు దోచుకునే ప్రయత్నం చేశారు.ఈ దాడిలో ఆమె గాయాలుపాలు కావడం జరిగింది, మొబైల్ అపహరించారు.ఆమెను విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు, డబ్బులు, నగలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.చౌరాసియాపై దాడికి పాల్పడిన ఆగంతుకుడు ఆ పై నాలుగు గంటల పాటు ఆ పరిసరాల్లోనే సంచరించినట్లు టవర్ లొకేషన్లో సిగ్నళ్లు ద్వారా తెలిసింది.
ఆ దుండగుడు సుమారు 4 గంటల పాటు అదే ప్రాంతంలో ఉండటం అంతు చిక్కని మిస్టరీగా మారింది.కాగా ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు పలు కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది.8.44 గంటలకు ఆమె స్టార్బక్స్ హోటల్ ముందు వాక్వేలో వాకింగ్ చేస్తోంది.అప్పటికే అక్కడ కాచుకొని ఉన్న దుండగుడు వెనకాల నుంచి వచ్చి ఆమెను కిందకు తోసేసి దాడికి పాల్పడ్డాడు.
పది నిమిషాల పాటు పెనుగులాడిన ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది.పోలీసులకు సమాచారం ఇస్తున్న సమయంలోనే దుండగుడు ఆమె చేతుల్లో నుంచి ఫోన్ లాక్కున్నాడు.

ఇక అదే సమయంలో ఆమె బయటికి పరుగులు తీసింది.9.14 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు స్టార్బక్స్ హోటల్ వద్దకు చేరుకున్నారు.కొద్దిసేపట్లోనే బాధితురాలికి స్నేహితుడు, తల్లి అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు.
దాడి అనంతరం ఫోన్ లాక్కున్న దుండగుడు అక్కడి నుంచి నేరుగా వాక్వేలో నడుచుకుంటూనే సీవీఆర్ న్యూస్, జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ ఇంటి వద్ద గేటులో నుంచి బయటికి వచ్చి ఫుట్పాత్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్టు, కేబీఆర్ పార్కు వైపు నడక సాగించాడు.నెక్సా షోరూం ఎదురుగా ఉన్న కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్వే పార్కింగ్స్థలంలో చిచ్చాస్ హోటల్ వద్దకు ఒంటిగంటకు చేరుకొని అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు.

పోలీసు బృందాలు పార్కు చుట్టూ రోడ్లపై గాలింపు చేపట్టి ఉంటే నిందితుడు జూబ్లీహిల్స్ చెక్పోస్టు నుంచి కేబీఆర్ పార్కు వైపు ఫుట్పాత్పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే గుర్తించి ఉండేవారు.పార్కు చుట్టూ పోలీసు బృందాలు అదే రాత్రి జల్లెడ పట్టి అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులను ప్రశ్నించి ఉంటే దుండగుడి ఆచూకీ తెలిసి ఉండేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.పలు అనుమానాలకు తావిస్తున్న ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.