ఎన్నికల ముందు ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా మారుస్తామని చెప్పిన మేరకు వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.ఈ కొత్త జిల్లాల అంశం మాత్రం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.
ఏకంగా అధికార పార్టీ వైసీపీ నేతలే కొందరు మండిపడుతున్నారు.అయితే ఉగాది నుంచే కొత్త జిల్లాల పాలన చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విధితమే .ఇది కొందరి వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది.ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13జిల్లాలు జోడించి 26 జిల్లాల ఏపీని చేయనున్నారు.
ఈక్రమంలోనే కొన్ని జిల్లాల రూపు రేఖలు మారిపోనున్నాయి.దీంతో ప్రస్తుత జిల్లాల్లో పట్టున్న నాయకులు, పేరు మోసిన నేతలకు గుబులు పట్టుకుంది.
ఇందులోనే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గం మొత్తం శ్రీబాలాజీ జిల్లాలోకి వెళ్లిపోనుంది.
అలాగే చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలతో చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు కానుంది.అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటు చేయనున్నారు.
దీంతో ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీబాలాజీ జిల్లా రాయలసీమలో చేరనుంది.దీంతో ఆనంకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.నెల్లూరులో మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా .దశాబ్ధాలుగా ఆనం కుటుంబం చక్రం తిప్పుతున్న విషయం విధితమే.ఈక్రమంలో నెల్లూరు జిల్లాను కాదని శ్రీబాలాజీ జిల్లాలో కొనసాగడం అంటే కష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఎటు చూసినా రాజకీయంగా, సన్నిహిత వర్గాల నుంచి ఇబ్బందులు ఎదురవ్వక మానదు.
అందుకనే నెల్లూరు నాయకుడిగా కొనసాగే యోచనలో ఆనం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నగరి రోజా, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, నూజివీడు ఎమ్మెల్యే ఇలా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు సైతం కొత్త జిల్లాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనే ఆనం మాత్రమే గళం విప్పుతున్నారు.మిగాతా వారు మౌనంగానే ఉంటున్నారు.
జిల్లా రూపు రేఖలు మారడంతో తమ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని ఆనం తెగేసి చెబుతున్నారు.మిగిలిన వారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
గళం విప్పితే అధిష్టానం మొట్టికాయలు వేస్తుందనుకున్నారో ఏమో గానీ మౌనమే ప్రదర్శిస్తున్నారు.అయితే ఆనం వ్యాఖ్యలతో అధిష్టానం రియాక్షన్ చూసి స్పందించాలని అనుకుంటున్నట్టు సమాచారం.
మరి ఆనం స్ఫూర్తిగా మిగతావారు ఎలా స్పందిస్తారో ? అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.