ఎప్పుడూ ఏదో ఒక వివాదం తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటూనే ఉంటుంది .సొంత పార్టీ నాయకుల మదే అసమ్మతి రాజుకుంటూ, పార్టీలోని నాయకుల మధ్యనే పోరాటం సాగుతూ ఉంటుంది.
మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో ఈ తరహా వ్యవహారాలు చోటుచేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది.మరోవైపు చూస్తే తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది.
ఈ ఏడాదిలోనే పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లి, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై దృష్టి సారించాల్సి ఉన్న, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం ఆ తాపత్రయం ఎక్కడా కనిపించడం లేదు.తాజాగా మరోసారి పాదయాత్రల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టాలని చూస్తున్నారు.దీనికి పార్టీ హైకమాండ్ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది కాబట్టి అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన పాదయాత్రకు అనుమతి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ సీనియర్లు సైతం తాము పాదయాత్ర చేస్తాం అంటూ హడావిడి చేయడం ఇప్పుడు పార్టీలో వివాదాస్పదంగా మారింది.ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క తో పాటు , మరికొంతమంది పాదయాత్ర చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపిస్తున్నారు.
రేవంత్ పాదయాత్ర చేపట్టడం వల్ల ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుంది కాబట్టి , తాము పాదయాత్ర చేపట్టి తమ ఇమేజ్ పంచుకుంటాం అన్నట్లుగా సీనియర్ నాయకులు వ్యవహరిస్తుండడం వివాదంగా మారింది.
ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.రాష్ట్రమంతా పర్యటించాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.ఇక వీరు ముగ్గురే కాకుండా , మరికొంత మంది సీనియర్లు తాము పాదయాత్ర చేపడతామని ప్రతిపాదన తీసుకు వస్తుండడంతో, తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర ల లొల్లి తప్పేలా కనిపించడం లేదు.
ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పులు తీసుకు వచ్చే అలాగే కనిపిస్తోంది.