సాధారణంగా మనం ఏదైనా శివాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ మనకు శివుడు లింగ రూపంలో లేదా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.కానీ మీరు ఎప్పుడైనా ఓకే దేవాలయంలో, ఒకే గర్భగుడిలో రెండు శివలింగాలు దర్శనమివ్వడం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఆలయం ఒకటుందని ఎప్పుడైనా విన్నారా? అయితే రెండు శివలింగాలు దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో? అలా ఉండటానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలోని కాలేశ్వరం భూపాలపల్లిలో ఉన్న ఆలయంలో ఒకే గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలందుకుంటున్నాయి.ఈ ఆలయంలో ఉన్న ఒక శివలింగం ముక్తేశ్వర లింగం(శివుడు), మరొక లింగం కాళేశ్వర లింగం (యముడు) ఈ ఆలయంలో ఈ విధంగా ముక్తేశ్వరుడు కాళేశ్వరుడు కొలువై ఉండటంవల్ల ఈ ఆలయానికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం అని పేరు వచ్చింది.
మొదట ఈ ఆలయంలో కేవలం శివుడు మాత్రమే కొలువై ఉండి పూజలు అందుకునే వాడు.భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ వారిని ఎల్లవేళలా కాపాడుతుండే వాడు.ఈ విధంగా ఆ పరమశివుడు ప్రజలను కాపాడటం వల్ల యమధర్మరాజుకు ఎలాంటి పని లేకుండా ఉండేది.

ఆ సమయంలో యముడు వెళ్లి ముక్తీశ్వర స్వామిని వేడుకోగా, శివుడు యముని తన పక్కనే కొలువై ఉండమని కోరాడు.ఎవరైతే ముక్తేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుని, కాళేశ్వర లింగాన్ని దర్శనం చేయకుండా వెళ్తారు అలాంటి వారికి మోక్షం లభించదని, వారికి మరణం దగ్గరలో ఉందని, అలాంటివారిని నేరుగా నరకానికి తీసుకువెళ్ళమని యముడికి తెలియజేశాడు.అప్పటి నుంచి భక్తులు ఈ ఆలయంలో కొలువై ఉన్న రెండు శివలింగాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో ఉన్న రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం విశేషం.ముక్తేశ్వర లింగంలో రెండు రంధ్రాలు ఉండటం వల్ల అభిషేకం చేసిన జలాలు ఆ రంధ్రాల గుండా సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలవడం వల్ల ఆ నీటిని ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.