అవును, ఆ కుక్క చాలా అదృష్టవంతురాలు.ఎంత అదృష్టవంతురాలంటే, దాని ఆరోగ్యం కోసం ఆ వూరి ప్రజలంతా ప్రార్ధనలు చేశారు.
ఓ భారీ కణితి కారణంగా నరకయాతన అనుభవిస్తున్న ఈ శునకానికి సర్జరీ చేయించేందుకు ఆఊరి ప్రజలు ఏకమయ్యారు.వివరాల్లోకి వెళితే, కాసర్గోడ్లోని కోడోం-బెల్లూర్ గ్రామ పంచాయితీలోని చుల్లిక్కర గ్రామంలో ముత్తుమణి అనే ఒక ఆడ కుక్క నివసిస్తోంది.
ఇండియన్ పరియా డాగ్ అనే జాతికి చెందిన ఈ శునకం ప్రతి సంవత్సరం అందమైన కూనలకు జన్మనిస్తుంది.అలా జన్మనిచ్చిన కూనలను ఆ వూరి ప్రజలు పెంచుకుంటూ వుంటారు.
పిల్లలను కనే క్రమంలో ఆ శునకానికి రొమ్ముల వద్ద ఒక వాపు కనిపించింది.వారం రోజుల వ్యవధిలోనే ఆ వాపు పెద్దగా మారడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.
దాంతో దానిని రాజపురంలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ ఒక డాక్టర్ సిరంజితో వాచిన శరీర భాగం నుంచి ఓ ద్రవాన్ని వెలికితీశారు.
దీంతో కుక్క రొమ్ముల వద్ద వాపు కాస్త తగ్గింది.వాపు తగ్గడం చూసి గ్రామస్థులు కాస్త కుదుట పడ్డారు.
అయితే వారి సంతోషం మూన్నాళ్ళ ముచ్చటే అయింది.ఒక వారం రోజుల వ్యవధిలోనే ఆ వాపు ఎప్పట్లాగానే పెద్దగా తయారవడంతో మరొకసారి ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు.
ఓ డాక్టర్ సూచనతో వారు మరో ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు ముత్తుమణి క్షీరరసగ్రంధి కణితితో బాధ పడుతుంది అని చెప్పారు.అనంతరం శస్త్రచికిత్స చేసి 5 కిలోల బరువున్న క్షీరరసగ్రంధి కణితిని వారు తొలగించారు.ప్రస్తుతం ముత్తుమణి ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడి సర్జన్ తెలిపారు.సీనియర్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ఎ మురళీధరన్ మాట్లాడుతూ కణితి ముత్తుమణి వీపును వంచి దాన్ని బాగా కృంగదీసింది అన్నారు.ప్రస్తుతం ఈ కుక్క ఇప్పుడు త్రికరిపూర్ వెటర్నరీ హాస్పిటల్లోని ఏబీసీ సెంటర్ షెల్టర్లో కోలుకుంటుంది.
దాంతో ఆ గ్రామస్థులు ఊపిరి తీసుకున్నారు.