మెరుగైన జీవితం కోసమో, కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల వల్లనో లక్షలాది మంది భారతీయులు పొట్ట చేతపట్టుకుని వివిధ దేశాలకు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే అపారమైన ప్రతిభా పాటవాలతో పాటు శ్రమించే గుణం భారతీయులు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
ఇది చూసి ఆయా దేశాల్లోని స్థానికులకు కంటగింపుగా మారింది.ఎక్కడి నుంచో వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారనే అక్కసుతో జాతి, వర్ణ వివక్షను చూపుతూ భారతీయులను మానసికంగా కృంగదీస్తున్నారు.
ఇక హత్యలు, భౌతిక దాడుల సంగతి సరేసరి.నిత్యం ప్రపంచంలోని ఏదో ఒక మూల భారతీయులపై జాత్యహంకార దాడులు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
భారతీయులే కాదు.మిగిలిన దేశాల ప్రజలు కూడా వలస వెళ్లిన ప్రాంతంలోని స్థానికులకు లక్ష్యంగా మారుతున్నారు.
జాత్యహంకార దాడులు అధికంగా జరిగే దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి.అయితే ఇటీవలికాలంలో జాతి వివక్షకు సంబంధించిన ఘటనలు ఎక్కువ కావడంతో సింగపూర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.జాతి సామరస్యంపై తీసుకురానున్న చట్టంలో సామాజిక ప్రవర్తన, నిబంధనలు వుంటాయని హోం వ్యవహారాల శాఖ మంత్రి కె.షణ్ముగం తెలిపారు.

కోవిడ్ 19 వెలుగు చూసిన తర్వాత సింగపూర్లో జాత్యహంకార దాడులు, జాతుల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో ఆగస్టు 29 నేషనల్ డే ర్యాలీ సందర్భంగా ప్రధాని లీ సీన్ లూంగ్ .‘‘ జాతి సామరస్య పరిరక్షణ చట్టాన్ని ’’ ప్రకటించారు.ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ చట్టాన్ని ప్రవేశపెడుతుందని… ఇది జాతి వివక్షకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేస్తుందని చెప్పారు.ఇక నేషనల్ డే ర్యాలీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.
జాతి వివక్షతో సహా ఉద్యోగ వివక్షను నిషేధించే మార్గదర్శకాలను ఇప్పుడు చట్టపరంగా ఇస్తామని ప్రకటించారు.ఈ చట్టం పని ప్రదేశాలు, బహిరంగ వేదికలపై జాత్యహంకారాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుందని చెప్పారు.
సింగపూర్లో 5.9 మిలియన్ల మంది జనాభా వుండగా.చైనీయులు ప్రథమ స్థానంలో వున్నారు.వీరి తర్వాత మలయ్ జాతి ప్రజలు, భారతీయులు, ఇతర ఆసియన్లు, కాకేసియన్లు వున్నారు.