ఏపీలో ఎన్నికల( Elections in AP ) ఫీవర్ కనిపిస్తోంది.ఎన్నికలకు ఇంకా చాలసమయమే ఉన్నప్పటికి, ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి.
ఈసారి గెలుపు విషయంలో మూడు ప్రధాన పార్టీలు ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాయి.దాంతో ఫలితాలను అంచనా వేయడం కొంత కష్టతరంగానే ఉంది.
ఈ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన గెలుపు దూరం అవుతుందనే ఉద్దేశంతో టిడిపి, జనసేన, వైసీపీ( TDP, Janasena, YCP ) ఇలా పార్టీలు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీ ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఎందుకంటే ఈసారి గెలిస్తే మరో పదేళ్ళు వైసీపీకే ఎక్కువ స్కోప్ ఉంటుంది.ఇదే విషయాన్ని జగన్ ( AP CM Jagan )పలు మార్లు చెప్పుకొచ్చారు కూడా.

ఈసారి కచ్చితంగా గెలవాలని, ఈసారి గెలిస్తే మరో 30 ఏళ్ళు అధికారం మనదే అని నేతలకు పదే పదే చెబుతూ వస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే జగన్ వ్యూహరచనలోనూ, నిర్ణయాలను తీసుకోవడంలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు.నేతలపై నిత్యం ప్రజా ధృష్టి ఉండేలా చూసుకుంటున్నారు.గడపగడపకు మన ప్రభుత్వం, ఇంటింటికి జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగన్ ఇలా ఎన్నో కార్యక్రమాలతో పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచుతూ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
అయితే గత ఎన్నికల ముందు జగన్ అంతా తానై చూసుకొని వైసీపీ విజయాన్ని తన భుజలపై మోశారనే చెప్పాలి.అయితే ఈసారి అలా కాకుండా ప్రతి నియోజిక వర్గంలో పార్టీ గెలుపు బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించే వ్యూహంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే నిర్ణయాన్ని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.ఎవరి జిల్లా బాధ్యతను వారే చూసుకొని నియోజిక వర్గాల పరిస్థితులను చక్కదిద్ది పార్టీ విజయనికి బాటలు వేయాలని జగన్ మంత్రులకు సూచించారు.ఇక జిల్లాలోని నేతలపై పూర్తి భారం వేయడం వల్ల వారు నిబద్దతతో పార్టీ కోసం పని చేస్తారనే ఆలోచన జగన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా చాలా నియోజిక వర్గాలలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
ఈ వ్యతిరేకతను అధిగమిచేందుకే జిల్లాల్లోని పార్టీ గెలుపు బాధ్యతను జగన్ స్థానిక నేతలపై మోపినట్లు తెలుస్తోంది.మరి వ్యతిరేకతను అధిగమించి నేతలు ప్రజలకు ఎలా దగ్గరవుతారో చూడాలి.