ఇటీవలే కాలంలో వివాహ బంధం కన్నా అక్రమ బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు.అక్రమ బంధానికి కట్టుబడి వివాహ బంధాన్ని హతమార్చి తమ జీవితంతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తున్నారు కొందరు మూర్ఖులు తాజాగా అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని చిన్న మండవ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోటకు చెందిన పెరం వెంకటేశ్వర్లు (46) కు 20 సంవత్సరాల క్రితం మేనమామ కుమార్తె దుర్గమ్మతో వివాహం అయ్యి మనస్పర్ధల కారణంగా మూడు నెలలకే విడిపోయారు.
వెంకటేశ్వర్లు వివాహమై ముగ్గురు పిల్లలున్న మరియమ్మను కులాంతర వివాహం చేసుకున్నాడు.
బాతుల పెంపకం వీరి జీవన వృత్తి కావడంతో ఖమ్మం జిల్లాలో నీటి వసతులు ఉండే ప్రాంతాలకు వెళ్లి బాతుల పెంపకం చేపడుతున్నారు.ఇలా ప్రాంతాలకు వలస వెళ్లే క్రమంలో ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చంద్రుపట్ల కు చెందిన దుగ్గిరాల శివకృష్ణతో మరియమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
15 రోజుల క్రితం వెంకటేశ్వర్లు, తన భార్య మరియమ్మ ఆమె కుమారుడు కిషోర్, మేనల్లుడు చరణ్ కుమార్ తో కలిసి బాతుల పెంపకం కోసం చిన్న మండవ గ్రామ సమీపంలో తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు.తన అక్రమ సంబంధానికి భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి గురువారం తెల్లవారుజామున గాడ నిద్రలో ఉన్న భర్త వెంకటేశ్వర్లు గొంతుకు చున్నీతో ఉరివేసి, ముఖంపై మట్టి గడ్డలతో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది.తరువాత రుద్రకోట లో ఉండే వెంకటేశ్వర్లు బంధువులకు ఫోన్ చేసి అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వర్లు ఎవరో కొట్టారని తెలిపింది.
పోలీసులకు సమాచారం అందించడంతో వైరా సీఐ సురేష్, ఎస్సై వెంకన్న సంఘటన స్థలానికి చేరుకుని మరియమ్మను విచారించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.అయితే మృతుడి బంధువు అంకయ్య, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని మరియమ్మ, ప్రియుడు శివకృష్ణతో కలిసి ఈ దారుణం చేసి ఉండవచ్చని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.