కొత్త మంత్రివర్గంలో కొత్త జిల్లాల నుంచి ఎవరుంటారు? పాత మంత్రులు మళ్లీ కొనసాగుతారా? పెద్దిరెడ్డికి బదులు చిత్తూరు జిల్లాలో ఎవరికి మంత్రిపదవి దక్కుతుంది? తిరుపతి జిల్లాలో తొలి మంత్రిగా జాక్పాట్ కొట్టబోతున్న ఎమ్మెల్యే ఎవరు? నగరి ఎమ్మెల్యే రోజాకు బెర్త్ కన్ఫామ్ అవుతుందా ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ విషయాలపై వాడీ వేడి చర్చ జరుగుతోంది.అంతే కాదు కొన్ని ప్రాంతాల్లో దీనిపై బెట్టింగులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా రాజకీయం వేడెక్కింది.ఈనెల 11 న కొత్త మంత్రి వర్గం కొలువు తీరనున్ననేపథ్యంలో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన నారాయణస్వామి, ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు పదవీకాలం దాదాపు ముగిసినట్టే, దీంతో వారి స్థానంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కు తుందన్న విషయం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశమైంది.
చిత్తూరు ఉమ్మడి జిల్లా పై సంపూర్ణ పట్టుగలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా కొనసాగుతారా?లేదా? అన్నదానిపై చర్చ సాగుతోంది.అధికార పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా చెప్పుకోదగ్గ కీలక నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు.జిల్లా లో ఆయన మాటకు ఇప్పటి వరకూ తిరుగులేదు.
అందువల్ల రెండవ దఫా కూడా మంత్రివర్గంలో ఆయన కొనసాగుతారనే అధికార పార్టీలో అందరూ చెప్పుకుంటున్నారు.డిప్యూటీ సీఎం నారాయణస్వామికి రెండోసారి అవకాశం దొరక్కపోవచ్చు అంటున్నారు.
జిల్లాలో పెద్దిరెడ్డి ప్రాధాన్యత దెబ్బతినకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన అనుచరుల్లో అంటున్నారు.పెద్దిరెడ్డిని కొనసాగించకుండా ఇతరులకు అవకాశమివ్వాలని అధిష్ఠానం నిర్ణయిస్తే అపుడు పెద్దిరెడ్డి ఎవరికి సిఫారసు చేస్తారన్నది కూడా కీలకంగా మారనుంది.ఆయనకు పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ముగ్గురూ విశ్వాసపాత్రులుగానే వున్నారు.మిగిలేది నగరి ఎమ్మెల్యే రోజా.ఆమెకు బహిరంగంగా మంత్రి పెద్దిరెడ్డితో అంత సఖ్యత లేదనే ప్రచారం ఉంది.నగరిలో రోజాను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతల వెనుక పెద్దిరెడ్డి వున్నారని ఆమె అనుచరవర్గం భావిస్తోంది.
తొలి దఫాలో మంత్రి పదవి దక్కనప్పుడే నిరాశకు గురైన రోజా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని అసంతృప్తిగానే స్వీకరించారు.తరువాత ఏపీఐఐసీ ఛైర్పర్సన్ పదవి కి ఆమె రాజీనామా చేశారు.
రెండో దఫా ఖచ్చితంగా అవకాశం దక్కుతుందన్న గట్టి నమ్మకంతో ఆమె తిరుమల నుంచి కాశి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారు.కచ్చితంగా ఈ సారి మంత్రి పదవి వస్తుందని ఆమె అనుచర వర్గం భావిస్తుంది.
ఇకపోతే కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా నుంచీ తొలిసారి మంత్రి పదవిదక్కే అదృష్టం ఎవరిదనే దానిపైనే ఇపుడు అందరూ దృష్టి సారిస్తున్నారు.ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లో ఎవరూ ప్రస్తుత మంత్రివర్గంలో లేరు.కాబట్టి అందరూ ఆశతోనే ఉన్నారు.అయితే చంద్రగిరి, తిరుపతి ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా ప్రచారంలో వున్నాయి.చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇప్పటికే ఈయనకు నాలుగు పదవులు ఉన్నాయి ,తుడా చైర్మన్, ప్రభుత్వ విప్, టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు.నిత్యం ప్రజల్లో తిరుగుతూ కరోనా లాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచారు.
ఇక తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నేపథ్యం తెలిసిందే.వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా సన్నిహితుడు.
ఆ కుటుంబంతో ఇపుడు బంధుత్వమూ ఏర్పడింది.అయితే దానికి తగ్గ రీతిలో ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆవేదన అనుచరవర్గంలో వుంది.
తొలి మంత్రివర్గంలోనే స్థానం ఆశించినా దక్కకపోవడంతో నిర్వేదానికి లోనైన ఆయన ఇదే తన చివరి ఎన్నికలంటూ కార్యకర్తల సమావేశంలో గతంలో ప్రకటించేశారు.తిరుపతి లో మత్తు పదార్థాలు వ్యతిరేకంగా నో డ్రగ్ సిటీఅంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఇపుడా ఇదే కారణాన్నే చూపుతూ ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అనుచరవర్గం ఆశలు పెట్టుకుంది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డికి సీఎం జగన్తో చనువు, స్నేహం వున్నా తొలిసారి గెలిచిన కారణంగా మంత్రి పదవి ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకమవుతోంది.
ఇక మిగిలిన సత్యవేడు, సూళ్ళూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు ముగ్గురూ ఎస్సీలు.ఈ వర్గానికి ఇవ్వదలిస్తే సూళ్ళూరుపేట నుంచీ సంజీవయ్య, సత్యవేడు నుంచీ ఆదిమూలంలలో ఒకరికి ఛాన్సు రావచ్చు.
మంత్రి పెద్దిరెడ్డి సిఫారసు ఆదిమూలానికి అదనపు బలం కావచ్చు.