నిరంతరం వినిపించే ‘ఓం నమశ్శివాయ’ మంత్రం.రోజుకొకటి చొప్పున పార్వతీపరమేశ్వరులకు జరిపే సేవలూ.
ఆది దంపతులకు అంగరంగ వైభవంగా నిర్వహించే కల్యాణం.పాహిమాం పరమేశ్వరా అంటూ ప్రార్థించే భక్తులూ.
ఈ వేడుకలన్నీ శ్రీశైలంలో మహాశివరాత్రి సమయంలో పదకొండు రోజులపాటు నిర్వహించే బ్రహోత్సవాల్లో కనిపించే విశేషాలు.
దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున.
జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం.ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది.
మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిపే బ్రహ్మోత్సవాలనూ, శివ పార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు సుమారు పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా.ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎందరో శివభక్తులు పాదయాత్ర చేసి మరీ శ్రీగిరిని చేరుకునేందుకు ఆసక్తి చూపించడం విశేషం.