ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్రం కావడంతో పాటు , చలో విజయవాడ సక్సెస్ కావడం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.ఇటు ఉద్యోగ సంఘాలు , అటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవహారాన్ని తీసుకోవడంతో ఈ విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు.
పిఆర్సి విషయంలో ఉద్యోగులు వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం, ప్రభుత్వం అదే విధంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారుతుందని అంత అభిప్రాయపడుతున్న సమయంలోనే ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో పాటు, ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు.ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్ల విషయంలో వారిని సంతృప్తి పరిచేందుకు మంత్రుల కమిటీ సిద్ధమైంది.
అలాగే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అంగీకారానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ రోజు ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీ బేటీ కాబోతున్నాయి.
ఈ సందర్భంగా ఫిట్మెంట్, ఐ ఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ అంశాలతో పాటు మరికొన్ని అంశాలపై ఉద్యోగుల్లో నెలకొన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చేస్తామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఉద్యోగులతో కలిసి తాము పని చేయాలన్నదే తమ తాపత్రయం అని బొత్స పేర్కొన్నారు.పీఆర్సీ ఐదేళ్లకు తగ్గించే అంశానికి తాము అంగీకరించమని , అలాగే ఐ ఆర్ రికవరీ చేయకూడదని ఉద్యోగులు అడిగారని దానికి అంగీకరించామని, పిఆర్సి కి సంబంధించి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన అన్ని అంశాల పైన పూర్తిస్థాయిలో కమిటీతో చర్చించామని బొత్స పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు.
అయితే ఈ చర్చల వ్యవహారం ఇలా ఉండగానే ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించారు.ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కాస్త మెత్త బడటం, ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించడం తో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.