అగ్ర రాజ్యం అమెరికాకు అత్యంత బలమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సైనిక వ్యవస్తే.రాటుదేలిన, నిష్ణాతులైన సైనిక బలం అమెరికా సొంతం.
ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా తమ దేశం కోసం వీరోచితంగా పోరాడి విజయాన్ని దక్కించుకోవడంలో వారికి వారే సాటి.అమెరికా ప్రభుత్వం కూడా తమ సైనికులకు అధునాతన టెక్నాలజీ అందిస్తూ వారికి ఎప్పటికప్పుడు తర్ఫీదులు ఇస్తూ అమెరికాకు బలమైన రక్షణ వ్యవస్థగా తీర్చి దిద్దుతోంది.
అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అమెరికాను కలవర పెడుతున్నాయి…వివరాలలోకి వెళ్తే.
అమెరికాకు అత్యంత కీలకమైన పెంటగాన్ తెలిపిన వివరాల ప్రకారం.
అమెరికాలో సైనికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, ప్రతీ మూడు నెలలకు ఒక సారి సైనికుల మరణాలు చూస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరణించే వారివి సహజ మరణాలు కాదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రకటించింది.ఈ ప్రకటనతో ఒక్క సారిగా అమెరికా ప్రభుత్వం ఉలిక్కిపడింది.
అంతేకాదు కరోనా సోకిన తరువాత మరణించిన సైనికుల మరణాల కంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సైనికుల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయట.
ఏప్రియల్ నెల మొదలు, జూన్ చివరి వరకూ దాదాపు 139 మంది సైనికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందులో దాదాపు 99 మంది అత్యంత నిపుణులైన సైనికులని తెలిపింది పెంటగాన్.
ఇదిలాఉంటే కరోన కారణంగా అమెరికాలోఇప్పటి వరకూ 58 మంది చనిపోయారని, అయితే ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య దీనితో పోల్చితే మూడు రెట్లు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.మరొక షాకింగ్ విషయం ఏమిటంటే, ఇప్పటి వరకూ మృతి చెందిన సైనికులలో దాదాపు 60 శాతం మంది 30 ఏళ్ళ లోపు వారే ఉన్నారని, ప్రతీ లక్షమందిలో 36 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపింది.
సైనికులపై వస్తున్న తీవ్ర ఒత్తిడుల కారణం గా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని లేదంటే భవిష్యత్తులో మరిన్ని మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.