మసాచుసెట్స్ నుంచి సెనేట్ బరిలో నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మనవడు జో కెనడీ కోసం భారతీయ అమెరికన్లు రంగంలోకి దిగారు.జో కెనడీ ప్రచారానికి సంబంధించి వర్చువల్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రస్తుతం మసాచుసెట్స్ సెనేటర్గా వున్న ఎడ్ మార్కీతో జో కెనడీ తలపడుతున్నారు.శుక్రవారం ఫండ్ రైజర్ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ… మసాచుసెట్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎలా పరిష్కరించాలో తాను యోచిస్తున్నట్లు జో కెనడీ స్పష్టం చేశారు.
చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో వ్యాపారాలను పునర్నిర్మించడం తన ప్రాధాన్యత అని జో పేర్కొన్నారు.మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ఇటీవల జరుగుతున్న దాడుల కారణంగా అమెరికా విలువలు దిగజారిపోతున్నాయని చెప్పారు.
వర్చువల్ కాన్ఫరెన్స్, ఫండ్ రైజర్లో ప్రముఖ భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.
వీరిలో రమేశ్ కపూర్, కోటి శ్రీనివాస్, భరత్ బరై, అనిల్ దేశ్పాండే, రాజేందర్ డిచ్పల్లి, రవి చందాని, అనుప్ వశిస్ట్, విజయ్ నలమడ ఉన్నారు.కెనడీ కుటుంబానికి చిరకాల మిత్రుడైన రమేశ్ కపూర్ మాట్లాడుతూ… భారతీయ అమెరికన్ సమాజానికి జో మంచి స్నేహితుడిగా ఉన్నారని పేర్కొన్నారు.సెనేట్ ఆర్మ్డ్ సర్వీస్ కమిటీ సభ్యుడిగా భారత్- అమెరికాలు ఎదుర్కోంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి సాయం చేస్తారని రమేశ్ ఆకాంక్షించారు.
ఇమ్మిగ్రేషన్ విధానాలను సంస్కరించాలని, ప్రస్తుత కోటా విధానాన్ని అమెరికా తొలగించేలా చూడాలని నలమడ జో ను కోరారు.తద్వారా భారత్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు మేలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఓసారి అమెరికా పర్యటనకు వచ్చారు.ఈ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్ కెనడీ తన ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఎయిర్పోర్టులో నెహ్రూకి స్వాగతం పలికిన విషయాన్ని డిచ్పల్లి గుర్తుచేశారు.
కాగా జో కెనడీ సెనేటర్గా ఎన్నికై భారతదేశాన్ని సందర్శిస్తారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ఇండో- అమెరికన్ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.