ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరోనా మహమ్మారి నుంచి స్వేచ్ఛ కోసం దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన కర్తవ్యాలకు కట్టుబడాలని కోరారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మన్కీ బాత్లో ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.
కరోనా వైరస్ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, వ్యాధి తీవ్రత ప్రారంభమవ్వడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పలు దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల రేటు తక్కువగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.అయినప్పటికీ కరోనా వైరస్ ముప్పు ఇంకా ముగియలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
మన్ కీ బాత్లో త్వరలో జరగనున్న రక్షాబంధన్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.ఈ ఏడాది ఈ పండుగను వైవిధ్యంగా జరుపుకోవాలని సూచించారు.రాఖీ పండుగ ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించాలని కోరారు.దేశీయ, ప్రాంతీయ ఉత్పత్తులను వాడకం పెరగాలని అన్నారు.
చేనేతను, హస్తకళను భారతీయులు వీలైనంత ఎక్కువగా వాడాలని కోరారు.
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
కార్గిల్ యుద్ధంలో గెలిచి నేటికి 21 సంవత్సరాలైన సందర్భంగా సైనికు త్యాగాలను ప్రధాని మోదీ కొనియాడారు.యుద్ధంలో సైనికులు చూపిన ధైర్య పరాక్రమాలను ఎప్పటికీ మరువలేమని మోదీ అన్నారు.
సైనికుల త్యాగాలను యువత విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.పాకిస్థాన్ కుట్రపూరితంగా భారత్ భూభాగాన్ని అక్రమించే ప్రయత్నం చేయడం వల్లే కార్గిల్ యుద్ధం సంభవించిందని ప్రధాని మోదీ విమర్శించారు.