ఉగ్రవాదాన్ని అణిచివేయడమే లక్ష్యంగా గడిచిన 20 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో అమెరికా నిర్వహించిన పోరు ముగిసింది.ఏదో సాధించాలని, ఇంకేదో చేయాలనే లక్ష్యంతో ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టిన అగ్రరాజ్యం చివరికి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
దీనికి తోడు ప్రపంచ దేశాల పెదవి విరుపులతో పెద్దన్న పరువు పోయింది.అమెరికా హడావిడి నిర్ణయంతో తాలిబన్లు అత్యంత సునాయసంగా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించి పాలనకు రెడీ అవుతున్నారు.
కరడు గట్టిన ఇస్లాం చట్టాలను అనుసరించే వీరి పాలనకు భయపడి లక్షల మంది ఆఫ్ఘన్లు దేశాన్ని వీడుతున్నారు.ఆగస్టు 31 నాటికి విదేశీయుల తరలింపు ప్రక్రియ పూర్తి కావడంతో కాబూల్ ఎయిర్పోర్ట్ను తాలిబన్లు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు.
దీంతో దేశాన్ని వీడాలనుకుంటున్న ఆఫ్ఘన్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ను వీడి వెళ్లిన మరుక్షణం నుంచి తాలిబన్లు అరాచకాలకు దిగారు.
అమెరికా హెలికాఫ్టర్లో ఓ వ్యక్తి మృతదేహన్ని వేలాడదీస్తూ.గగనవీధుల్లో విహరించారు.
దీంతో పాటు హజారా మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఊచకోతకు దిగారు.తద్వారా రాబోయే రోజుల్లో ఎలా వుండబోతుందనే దానిపై చిన్న ట్రైలర్ వదిలారు.
అయితే ఇంతటి కల్లోలానికి కారణం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయమేనంటూ ప్రపంచం ఆయనపై విమర్శలు చేస్తోంది.అంతేకాదు సొంత దేశంలో ప్రజలు, విపక్షాల నుంచి కూడా బైడెన్ మాటలు పడాల్సి వస్తోంది.
తన జీవితంలో ఇలాంటి బలగాల ఉపసంహరణ చూడలేదంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ విమర్శించారు.ఈ నేపథ్యంలో బైడెన్ మీడియా ముందుకు వచ్చారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించడం తెలివైన, ఉత్తమ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.
అఫ్గానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సమర్థించుకున్నారు.20ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ముగించడం.‘తెలివైన, ఉత్తమ’ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు.ఆఫ్గాన్లో బలగాలను కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.1.20 లక్షల మందిని సురక్షితంగా తీసుకొచ్చాం.చరిత్రలో ఏ దేశం ఎప్పుడూ ఈ విధంగా చేయలేదు.అమెరికా మిలిటరీ అద్భుత నైపుణ్యం, ధైర్యం వల్లే ఈ ఆపరేషన్ విజయవంతమైందని బైడెన్ అన్నారు.

ఈ యుద్ధాన్ని ముగిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే దేశ ప్రజలకు హామీ ఇచ్చానని.ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉందని బైడెన్ తెలిపారు.అమెరికా ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ యుద్ధం కోసం బలగాలను కొనసాగించాల్సిన అవసరం ఏముంది.? అలాగే బిలియన్ డాలర్లను ఖర్చు చేయడం వల్ల అమెరికన్ల భద్రత పెరుగుతుందని తాను ఎంతమాత్రం విశ్వసించడం లేదు అని బైడెన్ స్పష్టం చేశారు.అయితే ఆఫ్గనిస్తాన్తో పాటు ఇతర దేశాల్లోని ఉగ్రవాదంపైనా పోరు సాగిస్తామని వెల్లడించారు.ఇందుకోసం ఆయా దేశాల్లో ఉండి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, తమ వ్యూహాలు తమకున్నాయని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
.