తల్లి తన బిడ్డ విషయంలో పిండదశనుండే అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది.ఈ క్రమంలో తల్లి బిడ్డ ఎదుగుదలకు అన్నిరకాల ఆహారపదార్ధాలు మెండుగా తీసుకుంటుంది.
గర్భిణి తినే ఆహారానికి, వారి కదలికలకు గర్భంలోని శిశువులు (పిండాలు) స్పందిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రమంలో గర్భిణులు మంచి ఆహారం తీసుకున్నప్పుడు గర్భస్థ శిశువులు ఆనంద పడటం, నచ్చని ఆహారం తీసుకున్నప్పుడు బాధపడటం కూడా చేస్తాయట.
ఈ విషయం గురించి ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్నా.తాజాగా ఆధారాలతో దీన్ని నిరూపించారు ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు.
తాజాగా దీనికి సంబంధించిన అల్ట్రాసౌండ్ రిపోర్టును కూడా విడుదల చేయడం జరిగింది.ఈ పరిశోధన ప్రకారం.
ఇంగ్లండ్ పరిశోధకులు వంద మంది గర్భిణులను ఎంపిక చేసి వారిని 3 గ్రూపులుగా విభజించారు.ఒక గ్రూపు గర్భిణులకు కాకర కాయతో తయారు చేసిన క్యాప్సూల్స్ ఇచ్చారు.
మరో గ్రూపు గర్భిణులకు క్యారెట్తో తయారు చేసిన క్యాప్సూల్స్ ఇచ్చారు.ఇంకో గ్రూప్నకు ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ ఇచ్చారు.
గర్భిణులు వీటిని తీసుకున్న 20 నిమిషాల తర్వాత వారికి 4డీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.
అయితే ఈ పరీక్షల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.కాకర కాయ క్యాప్సూల్స్ తిన్న గ్రూపునకు చెందిన గర్భస్థ శిశువులు బాధతో ముఖం పెట్టుకుని ఉంటే, క్యారెట్ క్యాప్సూల్స్ తిన్న గ్రూపునకు చెందిన శిశువులు నవ్వుతూ ముఖం పెట్టుకొని ఉండటం ఆ రిపోర్టులో మనం చూడవచ్చు.అలాగే ఏ ఫ్లేవర్ లేని క్యాప్సూల్స్ తిన్న గ్రూప్ గర్భిణులకు చెందిన శిశువుల ముఖాలు కూడా ఆనందంగానే కనిపించాయి.
దీన్ని బట్టి గర్భంలోని శిశువులు కూడా తల్లులు తీసుకునే ఆహారానికి స్పందిస్తున్నట్లు, నవ్వడం, ఏడ్వడం వంటి భావాలు కలిగి ఉన్నట్లు తేలింది.గర్భిణులు మంచి ఆహారం తీసుకుంటే, దాని ప్రభావం గర్భస్థ శిశువులపై ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
కాబట్టి మంచి ఆహారాన్నే తీసుకోండి.