అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి అల్లాడిపోతోంది.మొదటి వేవ్ లోనే చుక్కలు చూసిన అమెరికా ప్రజలు థర్డ్ వేవ్ డెల్టా వేగం చూసి ఆందోళన చెందుతున్నారు.
రోజు రోజుకు లెక్కకు మించిన కేసులు నమోదు అవడంతో తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.ఒక పక్క కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మరలా తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరో పక్క కరోన పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఏం చేయాలో తోచని స్థితిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కరోనా కారణంగా నిన్న ఒక్కరోజులో 2,600 మంది చనిపోవడంతో థర్డ్ వేవ్ తీవ్రత అమెరికాలో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని అంటున్నారు నిపుణులు.
న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం.గడిచిన వారంలో రోజుకు సగటున 2వేల మంది మృతి చెందుతున్నారని, ప్రకటించింది.ముఖ్యంగా అమెరికాలో ప్రధాన రాష్ట్రాలైన ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా, నుంచీ అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని తెలిపింది.గడిచిన నెలలో అమెరికా వ్యాప్తంగా సుమారు 3 లక్షల కేసులు నమోదు అయ్యయాని ఆ తరువాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చినా, మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతోందని న్యూయార్క్ టైం వెల్లడించింది.
నిన్న ఒక్క రోజులో 1.65 లక్షల కేసులు నమోదు అయ్యాయని అయితే గతంలో పోల్చితే కేసుల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య మాత్రం వేగంగా పెరుగుతోందని గతంలో మరణాల సంఖ్య 800 నుంచీ 1200 మధ్యలో ఉండేదని కానీ ప్రస్తుతం మృతుల సంఖ్య 2 వేలకు చేరుకుందని ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, అమెరికా ప్రజలపై డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగానే ఉందని హెచ్చరిస్తోంది అమెరికా సిడిసి.ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా కేసులేనని వెల్లడించింది.