రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోవిడ్ పై చర్చ జరుగగా, శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీ పై వ్యంగ్యంగా ప్రశ్నలు సంధించారు.
కోవిడ్ పై చర్చ నేపథ్యంలో మాట్లాడిన ఆయన నా తల్లి,సోదరుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అయితే వారు కూడా కోలుకున్నారు.వారే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్య లో జనం ఈ వైరస్ బారిన పడగా చాలా మంది కోలుకున్నారు.
ముఖ్యంగా ముంబైలోని ధారావిలో ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నట్లు ఆయన తెలిపారు.బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకున్నట్లు ఎంపీ రౌత్ తెలిపారు.
అయితే కరోనా మహమ్మారికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు అని, సుమారు 30 వేల మంది తమ రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్నారని, మరి వారంతా ఎలా కోలుకున్నారని, వాళ్లంతా బాబీజీ పాపడ్ తిని కోలుకున్నారా అంటూ రౌత్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
కరోనా ను నియంత్రించేందుకు బాబిజీ పాపడ్ ఉపయోగపడుతుంది అంటూ ఆ మధ్య ఒక బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ రౌత్ ఇలాంటి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తుంది.
అయినా ఇదేమీ రాజకీయ పోరాటం కాదు అని, ఇది జీవితాలను కాపాడే పోరాటం అని దీనికోసం ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు అంటూ రౌత్ కోరారు.మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు పైగా నమోదు కాగా మృతుల సంఖ్య 30 వేలకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.