వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లినప్పటికీ ప్రవాస భారతీయులకు మాతృదేశంపై అంతులేని ప్రేమ, గౌరవం వున్నాయి.తాము ఈ స్థాయికి రావడానికి కారణమైన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వారు సదా సిద్దంగానే వుంటారు.
ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో వున్న ప్రవాసీ సంఘాలు భారత్లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయి.దీంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, కంపెనీల ఏర్పాటు ద్వారా దేశంలో పారిశ్రామికాభివృద్ధికి సైతం ఎన్ఆర్ఐలు పాటుపడుతున్నారు.
ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రవాస భారతీయులు చేసిన సేవలు ఎవరూ మరిచిపోలేరు.వివిధ దేశాల నుంచి పీపీఈ కిట్లు, మందులు, రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తదితర వస్తువులను భారతదేశానికి పంపారు.
తాజాగా గ్రామీణ భారతదేశంలో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు గాను అమెరికాలో స్థిరపడిన భారత సంతతి వైద్యులు నడుం బిగించారు.
అమెరికాలో ఎన్ఆర్ఐ వైద్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) సభ్యులు, గత వారం వర్చువల్ ఈవెంట్లో భారతదేశంలో గ్రామీణ ఆరోగ్యానికి సంబంధించి అడాప్ట్-ఏ-విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డాక్టర్ సతీశ్ కత్తుల చైర్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుపమ గొట్టిముక్కల, డాక్టర్ జగన్ ఐలాని, డాక్టర్ రామ్సింగ్లు సభ్యులుగా వున్నారు.
ఈ సందర్భంగా ఏఏపీఐ అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల అడాప్ట్ ఏ విలేజ్ లక్ష్యాలను వివరించారు.
ఏఏపీఐ గ్లోబల్ టెలిక్లినిక్స్ సహకారంతో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఇండియాలోని 75 గ్రామాలను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు , తెలంగాణా రాష్ట్రాలలోని గ్రామీణ ప్రజలకు రక్తహీనత, అధిక కొలెస్ట్రాల్, పోషకాహార లోపం, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం , హైపోక్సిమియా వంటి వాటికి ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తామని అనుపమ చెప్పారు ఫలితాలను ఏఏపీఐ గ్లోబల్ టెలి క్లినిక్స్ విశ్లేషించి, తదుపరి చర్యకు సంబంధించి నిపుణుల బృందం సిఫార్సు చేస్తుందన్నారు.“ఆజాది కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఏఏపీఐ నుంచి భారతమాతకు ఇది ఒక చిన్న సహకారం అని అనుపమ చెప్పారు.