కాకినాడ: ఇటీవల కాకినాడ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు.కస్టమర్స్ సైతం తిన్న తర్వాత అక్కడ ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసి వెళుతున్న పరిస్థితులు కూడా కాకినాడ జిల్లాలో కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోనే పేరుగాంచిన సుబ్బయ్య హోటల్ లో పాచిపోయిన కూరలు పెడుతున్నారంటూ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొద్దిరోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు.తాజాగా అన్నవరం తేటగుంట జాతీయ రహదారిపై గల వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ పై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం దాడులను నిర్వహించింది.
జాతీయ రహదారిపై ఈ హోటల్ ఉన్న నేపథ్యంలో అధికారులు వంటకాలను క్షుణ్ణంగా పరిశీలించారు.వైరా హోటల్లో మాత్రం రంగులు కలిపి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు ఇవి తీసుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్య బారినపడతారని తెలిపారు.
కాబట్టి ఆ రంగులతో తయారుచేసిన వంట పదార్థాలను ల్యాబ్ కు పంపించడం జరుగుతుందన్నారు.దీనిలో భాగంగా రంగు కలిపిన చికెన్ జాయింట్స్ తో పాటు అనేక తినుబండారాలను శాంపిల్స్ గా అధికారులు తీసుకున్నారు.
ల్యాబ్ పంపించి రిపోర్టు వచ్చిన అనంతరం హోటల్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మీడియా తెలిపారు.
అదే విధంగా ఈ హోటల్ లైసెన్స్ కు సంబంధించి హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా గతంలో ఎప్పుడూ ఉన్న రిసిప్ట్ చూపిస్తున్నారని ఆ సమస్య సైతం ఈ హోటల్లో ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు.
జాతీయ రహదారి పై ఉండే హోటల్లో ఎటువంటి నిల్వ పదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా కిచెన్ అంతా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఫ్రిడ్జ్ లో ఎటువంటి నాన్ వెజ్ వంటకాలు వెజిటేరియన్ వంటకాలు నిల్వ ఉంచకుండా ఉండాలని అదేవిధంగా ఆయిల్ విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారి పేర్కొన్నారు.