నిత్యం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి.దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎలక్ట్రిక్ బైకులు ప్రత్యామ్నాయంగా మారాయి.ఇవి పర్యావరణ హితమైనవి.
అంతేకాకుండా ప్రజలకు ఖర్చును ఎంతో ఆదా చేస్తున్నాయి.అయితే మార్కెట్ లో నాణ్యమైన ఎలక్ట్రిక్ బైకులు చాలా ఖరీదుగా ఉంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఓ యువకుడు ఇంట్లోనే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు.పెట్రోలు ధర పెరిగిందని తండ్రి కష్టాలను చూసిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన జ్ఞానాన్ని ఉపయోగించి తన సాధారణ మోటార్సైకిల్ను ఎలక్ట్రిక్ బైక్గా మార్చాడు.
ఇప్పుడు, అతని ఎలక్ట్రిక్ బైక్ ఐదు గంటల పాటు ఛార్జ్ చేసిన తర్వాత 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన అఖిల్ రెడ్డిది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామం.అతడి తండ్రి ఓ రైతు.అఖిల్ రెడ్డి ఎల్పీయూ (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ) నుండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు.తండ్రి పొలానికి వెళ్లేందుకు బైక్ వాడడం లేదని అఖిల్ గమనించాడు.
కారణం ఏమిటో అని ఆరా తీస్తే పెట్రోల్ ధరలు అని తెలిసింది.దీంతో దీనికి ఓ పరిష్కారం కనుగొనాలని భావించాడు.
తనకు ఉన్న పరిజ్ఞానంతో ఎలక్ట్రిక్ బైక్ చేశాడు.సర్క్యూట్ బ్రేకర్ను దీనికి అమర్చడం ద్వారా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు తక్కువ.
దీనికి 5 గంటల పాటు ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.దీనికి కేవలం 5 యూనిట్లు మాత్రమే ఖర్చు అవుతుంది.
దీనిని 18 నెలలుగా వివిధ రూపాల్లో పరీక్షిస్తున్నాడు.దీనికి అనుమతి లభిస్తే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.దీనికి అతడు రూ.1.33 లక్షలను వెచ్చించాడు.తండ్రి బాధ చూసి ఓ వినూత్న ఆవిష్కరణ చేసిన అతడిని పలువురు ప్రశంసిస్తున్నారు.