ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ఉందని, 2024 ఎన్నికల్లోను తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు.ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, నేరుగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్నామని, పదేపదే జగన్ చెబుతున్నారు.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పైన, నేరుగా తమకు పథకాలు అందుతున్న తీరుపైన ప్రజల్లో సంతృప్తి ఉన్నా, వైసిపి ఎమ్మెల్యేల్లో మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి ఉంది.
ఏ విషయంలోనూ తమ ప్రమేయం లేకుండా అన్ని గ్రామ సచివాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, తమ పాత్ర నామమాత్రం అయిందని , ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో తమను ఎవరు గుర్తించుకుని ఓటు వేస్తారనే భయం అనేక సందర్భాల్లో జగన్ వద్ద చాలామంది ఎమ్మెల్యేలు ప్రస్తావించగా, ముఖ్యమంత్రిగా తన గ్రాఫ్ జనాల్లో పెరిగిందని, ఎమ్మెల్యేలుగా మీ గ్రాఫ్ పెంచుకోవాల్సిన బాధ్యత మీదేనని, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తీర్చుతూ అండగా ఉండాలంటూ జగన్ తేల్చి చెప్పేశారు.
ఇక ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తూ, ఆ నివేదిక ఆధారంగా వారికి క్లాస్ పీకుతూనే వస్తున్నారు.గతంలో 27 మంది ఎమ్మెల్యే ల తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామని, అప్పటికి పని తీరు మార్చుకోకపోతే , రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు అనే విషయాన్ని చెప్పేశారు.ఇప్పుడు ఆ సమావేశాన్ని డిసెంబర్ 14 వ తేదీన ఏర్పాటు చేశారు.
ఆ సందర్భంగా ఎమ్మెల్యే ల పనితీరుపై జగన్ నివేదికలు బయటపెట్టడం తో పాటు, పార్టీ జిల్లా ఇంఛార్జి లు, నియోజకవర్గ సమన్వయ కర్త ల పేర్లను ప్రకటించబోతున్నారు.దీంతో 14 వ తేదిన జరగబోయే సమావేశంలో జగన్ ఏం చెబుతారు ? ఏం చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.