ఉగాండా నియంత ఈదీ అమీన్ చేత బహిష్కరణకు గురైన ఉగాండా ఆసియన్లు, ఉగాండా భారతీయులు యూకేకు వలస వచ్చి 50 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ III వారితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.క్వీన్ ఎలిజబెత్ II మరణించిన తర్వాత ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కోలుకుంటోంది రాయల్ ఫ్యామిలీ.
ఈ ఘటన తర్వాత బకింగ్హామ్ ప్యాలెస్లో జరిగిన తొలి కార్యక్రమం ఇదే.దీనికి ఉగాండా, బ్రిటీష్- ఆసియన్, బ్రిటీష్ – ఇండియన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులతో పాటు యూకేలో భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి హాజరయ్యారు.
ఆగస్టు 4, 1972న దాదాపు 60 వేల మంది ఉగాండా ఆసియన్లు దేశం విడిచి వెళ్లాల్సిందిగా నాటి ఉగాండా నియంత ఈదీ అమీన్ నోటీసులు ఇచ్చాడు.వీరిలో 27000 వేలమంది యూకేకి పారిపోయి తాత్కాలిక సైనిక శిబిరాల్లో ఆశ్రయం పొందారు.
అప్పట్లో నిర్వాసితులకు మానవతా సాయాన్ని అందించేందుకు 63 స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా 16 తాత్కాలిక పునరావాస క్యాంపులు ఏర్పాటు చేశాయి.ఈ సందర్భంగా నాటి సాయాన్ని గుర్తుచేసుకుంది బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ.
మానవతా దృక్పథంతో అండగా నిలిచిన 60కి పైగా స్వచ్ఛంద సంస్థలకు ఈ 50 ఏళ్ల వేడుకల సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
1972లో ఉగాండా నుంచి వచ్చినప్పుడు భారత సంతతికి చెందిన రజియా జెథా, ఆమె భర్త రోషన్లకు ఎంపీ వర్జీనియా బాటమ్లీ, పీటర్ బాటమ్లీలు ఇంట్లో ఆశ్రయం ఇచ్చారని… ఈ సందర్భంగా వారితో కింగ్ చార్లెస్ మాట్లాడినట్లు ది నేషనల్ కథనాన్ని ప్రచురించింది.బ్రిటీష్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ 2012లో చెప్పినట్లుగా ఉగాండాకు చెందిన భారతీయులు, ఆసియన్లు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా అత్యంత విజయవంతమైన వలసదారుల సమూహాలలో ఒకరు.
నిజానికి భారతీయులు 1890లలోనే మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్లలో పనిచేసేందుకు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు.1970ల నాటికి వ్యాపారం, ఇతర రంగాలలో భారతీయులు అక్కడ ఉన్నత స్థానంలో నిలిచారు.ఇది నాటి ఉగాండా నియంత ఈదీ అమీన్ను ఆందోళనకు గురిచేసింది.
ఉగాండాను విడిచిపెట్టడానికి వారికి 90 రోజుల సమయం ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి 50 డాలర్లు ఇచ్చాడు.అనిశ్చిత పరిస్ధితుల మధ్య ఇళ్లు, వ్యాపారాలు, స్నేహితులను వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఉగాండా నుంచి శరణార్థులుగా వచ్చిన భారతీయులు బ్రిటన్లోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు.తూర్పు మిడ్లాండ్స్ పట్టణమైన లీసెస్టర్లో ఎక్కువమంది వున్నారు.