అయోధ్య రామ మందిరం. కోట్ల మంది భారతీయులకు ఇది ఒక కల.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్లుగా జరుగుతున్న పోరాటానికి ప్రతీకగా ప్రస్తుతం రామ మందిరం నిర్మాణం జరుగుతుంది.ప్రధానమంత్రి మోడీ దీనికి స్వయంగా శంకుస్థాపన చేయగా శరవేగంగా మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అయితే ఈ రామ మందిరానికి ఆర్కిటెక్చర్ పనులు చేస్తున్నది మన టాలీవుడ్ సెలబ్రిటీ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ఆర్కిటెక్చర్, ఆర్ట్ డైరెక్షన్ ఇలా ఈ రెండు రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఆనంద్ సాయి.
పవన్ కళ్యాణ్ కి స్నేహితుడిగా పేరు ఉన్న ఆనంద్ సాయి తెలుగులో యమదొంగ, సైనికుడు, బృందావనం, నాని, బాలు, గుడుంబా శంకర్ వంటి తెలుగు సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు.కేవలం సినిమాలకి మాత్రమే కాదు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించిన ఆర్కిటెక్చర్ పనులన్నీ కూడా ఆనంద్ సాయి పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి కూడా ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ చేయడం నిజంగా ప్రతి తెలుగు వాడికి గర్వకారణం అని చెప్పుకోవాలి.
ఒడిస్సాలో పుట్టి, పెరిగిన ఆనంద్ సాయి మద్రాసులో తన సినిమా కెరియర్ ను ప్రారంభించాడు.టాలీవుడ్ లో తనదైన రీతిలో సినిమాలకు ఆర్ట్ వర్క్ చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు.బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా తమిళ సినిమా న్యూ కి అవార్డ్ కూడా అందుకున్నాడు.
తొలి ప్రేమ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ చెల్లిగా ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకున్న నటి వాసుకి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇలా ఆనంద్ సాయి తన ఆర్ట్ వర్క్ తో, తనకున్న ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ తో దేశంలో నే అత్యున్నత రామ మందిరాన్ని నిర్మించడం నిజంగా గర్వకారణం.