ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయాన్ని అమలు చేసినా దానికి వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ సమర్థిస్తూనే మాట్లాడుతూ ఉంటారు.జనాల నుంచి ఆయా నిర్ణయాలు, ప్రభుత్వ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తమైనా, జనాలకు నచ్చకపోయినా బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు అయితే ప్రతి విషయంలోనూ జగన్ ను సమర్థిస్తూ , ప్రతిపక్షాలపై దుమ్మెత్తు పోస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు అటువంటి కొడాలి నానికి జగన్ తీసుకున్న నిర్ణయం పై క్షేత్రస్థాయిలో జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది బాగా అర్థమైంది.
ఈ విషయంలో నేరుగా జగన్ వద్ద తేల్చుకోవాలి అని నాని డిసైడ్ అయిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.
వివరాల్లోకి వెళితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జనాల్లోకి వెళ్తున్న కొడాలి నానికి అక్కడ ప్రజల నుంచి చెత్త పన్ను అంశంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
గతం నుంచి ఇదే రకమైన ఫిర్యాదులు నానికి అందుతూ ఉండడంతో, గుడివాడలో చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను నాని ఆదేశించారు అయినా అధికారులు ఆదేశాలను పట్టించుకోకుండా పన్ను వసూలు చేస్తుండడం నెలకు 16 లక్షలు టార్గెట్ విధించుకుంటే 14 లక్షలు వరకు వసూలు చేస్తుండడం, ఈ చెత్త పన్ను వసూలు పై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉండడం వంటి వ్యవహారాలపై తాజాగా నాని ఫైర్ అయ్యారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తున్న నానికి ఇదే అంశంపై ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవడంతో నాని పక్కనే ఉన్న అధికారులపై మండిపడ్డారు.
అయినా ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం కావడంతో అధికారులు ఇదే విషయాన్ని చెప్పగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానని నాని వ్యాఖ్యానించారు.అంతేకాదు మరో మాజీ మంత్రి పేర్ని నానికి ఫోన్ చేసి ఈ అంశంపై జగన్ తో చర్చిద్దామని ఆయన మాట్లాడడం వంటివి చూస్తుంటే, చెత్త పన్ను వ్యవహారం వైసిపి ప్రజాప్రతినిధులకు ఏ స్థాయిలో ఆగ్రహం కలిగిస్తుందో… జనాల నుంచి ఇంకే స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుందో ఇప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెలుగులోకి వస్తోంది.మరి ఈ విషయంలో జగన్ నాని మాట వింటారో లేదో చూడాలి.