ఇప్పటికీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలపై తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ, వైసిపి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ, గత కొంతకాలంగా జనసేన వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.రాబోయే ఎన్నికల వరకు ఈ తరహా ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ, వైసిపి ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తూ , జనసేన బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే జనసేన పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన రోడ్ల పరిస్థితిపై ఉద్యమించేందుకు సిద్ధమైంది.
గతంలోనూ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించింది.
దీనికి స్పందన బాగా రావడంతో పాటు, స్వయంగా ఏపీ సీఎం జగన్ సైతం స్పందించి ఏపీలో రోడ్ల పరిస్థితులను జూలై 15 నాటికి మెరుగుపరుస్తామని, ఎక్కడా గోతులు లేకుండా చేసి చూపిస్తామని ప్రకటించారు.ఇప్పుడు జగన్ విధించిన గడువు తేదీ దగ్గర పడుతున్నా, ఏపీలో రోడ్లు పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు.
ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు మరింత అద్వాన్న పరిస్థితికి చేరుకున్నాయి.ఇప్పుడు ఈ రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జనసేన నిర్ణయించుకుంది.
ఈ మేరకు దీనిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు.
అలాగే జులై 15 నుంచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో రోడ్ల దుస్థితి పై క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు.జనసేన పార్టీ నిర్వహించే డిజిటల్ క్యాంపెయిన్ ప్రభావం ఉంటుందని, రోడ్ల దుస్థితి ప్రజలలోనూ తీవ్ర అసంతృప్తి ఉందని, ఇప్పుడు అది మరింత రెట్టింపు అవుతుంది అనే టెన్షన్ వైసీపీ లోనూ మొదలయ్యింది.జనసేన నిర్వహించే గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం ద్వారా జరగబోయే నష్టాన్ని అధికార పార్టీ ఏ విధంగా నివారిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది అని, ప్రజలంతా సంతృప్తితో ఉన్నారని చెబుతున్న జగన్ ప్రభుత్వాన్ని ఏపీలో రోడ్లు వెక్కిరిస్తున్నాయి అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు జనసేన సిద్ధం అవుతోంది.