దేశంలో మహిళలపై నేరాల రేటు ఎక్కువగా వున్న జిల్లాల్లో అదనంగా వన్స్టాప్ సెంటర్లను (ఓఎస్సీ) ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు.దీనికి అదనంగా భారతీయ సంతతికి చెందిన మహిళలకు మద్ధతుగా 10 ఇతర దేశాల్లో ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేస్తామని స్మృతి ఇరానీ చెప్పారు.
ఓఎస్సీలు ప్రైవేట్, పబ్లిక్ ప్రదేశాలలో, కుటుంబంలో, కార్యాలయంలో హింసకు గురైన మహిళలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించబడ్డాయి.దీనిని 100 శాతం కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం నిర్వహించిన జోనల్ కాన్ఫరెన్స్లో స్మృతీ ఇరానీ మాట్లాడుతూ.దేశంలో పనిచేస్తున్న 704 ఓఎస్సీలు , అలాగే మహిళా హెల్ప్లైన్లు ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా మహిళలకు అండగా నిలిచాయని చెప్పారు.
కొత్తగా 300 ఓఎస్సీలను ప్రారంభించేందుకు రాష్ట్రాల మద్ధతును కోరుతున్నట్లు ఆమె తెలిపారు.తన శాఖతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో మరో 10 దేశాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
తద్వారా ఆయా దేశాల్లో పనిచేస్తున్న, స్థిరపడిన భారత సంతతి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తామని ఇరానీ పేర్కొన్నారు.

మరోవైపు సహకార స్పూర్తితో రాబోయే ఐదేళ్లలో పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ.పోషణ్, శక్తి, వాత్సల్యపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టింది.ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)ని రెండో స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం యోచిస్తోందని , రెండో బిడ్డగా ఆడపిల్ల పుడితే అలాంటి వారికి ఆర్ధిక సాయం అందించాలన్నదే తమ ఆలోచన అని ఇరానీ అన్నారు.పీఎంఎంవీవై కింద గర్బిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఖాతాలోకి రూ.5000 నగదు ప్రోత్సాహకం అందజేస్తోంది కేంద్రం.చిన్నారుల్లో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.